హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 20 (నమస్తే తెలంగాణ): పాత సచివాలయ భవనం కూల్చివేతతో వెలువడిన వ్యర్థాలను రీసైకిల్ చేసి పునర్వినియోగ నిర్మాణ సామగ్రిగా రూపొందించారు. పాత సచివాలయం కూల్చివేతతో 1.92 లక్షల టన్నుల వ్యర్థాలు వెలువడ్డాయి. ఈ వ్యర్థాలను రీసైక్లింగ్ చేసేందుకు సచివాలయం నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ఆర్ అండ్ బీ ఇంజినీర్లు జీడిమెట్లలోని సీ అండ్ డీ వేస్ట్ (నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాల) సంస్థను నిర్వహిస్తున్న రాంకీతో ఒప్పందం చేసుకున్నారు.
ఈ మేరకు వ్యర్థాలను రీ సైక్లింగ్ ప్లాంట్స్కు తరలించారు. కాంక్రీటు, స్లాబులు, ఇటుక గోడలు, కలప, ఇనుము వంటి వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో కాలుష్యరహితంగా రీ సైక్లింగ్ చేసి తిరిగి వినియోగించుకునేలా మార్చారు. 2020 జూలైలో మొదలైన నిర్మాణ వ్యర్థాల తరలింపు గత ఏడాది నవంబర్ వరకు కొనసాగింది. మొత్తం 7765 ట్రిప్పుల్లో 1,92,340.695 టన్నుల వ్యర్థాలను తరలించారు. మట్టి తప్ప దాదాపు మిగిలిన వ్యర్థాలన్నింటినీ పూర్తిస్థాయిలో రీసైకిల్ చేశారు. బండ రాళ్లను కంకరగా, కాంక్రీటును ఇసుకగా, సన్న కంకరగా మార్చామని, సిమెంట్ను ఇటుకల తయారీకి ముడిసరుకుగా ఉపయోగించామని అధికారులు చెబుతున్నారు.
కాంక్రీట్ దిమ్మెలు, ఇటుక గోడలు, రాళ్లు, కలప, ప్లాస్టిక్, ఇనుము, అల్యూమినియం వంటి వస్తువులను నిర్వహణ కేంద్రాల్లోని యంత్రాల్లో వేయగానే తుక్కుతుక్కు అవుతాయి. దుమ్ము, ధూళి పైకి లేవకుండా, పరిసరాలు కలుషితం కాకుండా వాటర్ వాషింగ్ అండ్ క్రషింగ్తో ప్రాసెసింగ్ చేస్తారు. నీటి ప్రవాహం వాటిలోని మట్టిని వేరు చేస్తుంది. సంప్రదాయ ఇసుక, కంకరను పోలిన రెండు రకాల ఇసుక, రెండు రకాల కంకర బయటకు వస్తాయి. లోహాలు, కాగితం, ప్లాస్టిక్, మట్టి, తారు, చెక్క వేర్వేరుగా విడిపోతాయి. బంకమట్టితో సిమెంట్, ఇసుక కంకరతో ఇటుకలు, పేపర్ బ్లాక్స్ వంటి వస్తువులను తయారు చేస్తున్నారు. వీటిని రోడ్లు, ఫుట్పాత్లు, పార్కులు, పార్కింగ్ షెడ్లు, గోడలు, ఇతరత్రా నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్నారు.