వ్యవసాయ యూనివర్సిటీ, జనవరి 19 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ వర్సిటీ భూములను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉన్నదని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్థులు పేర్కొన్నారు. అందరం కలిసి జీవో నెం 55 రద్దు చేసేదాకా పోరాడుదామని పిలుపునిచ్చారు. 11వరోజు నిరసనలో భాగంగా శుక్రవారం ఉదయం 10.30 గంటల నుంచే వర్సిటీ ప్రధాన గేట్లు మూసి, 10 డిపార్ట్మెంట్ల హెవోఓడీలను నిర్బంధించారు. ‘సేవ్ ద యూనివర్సిటీ ల్యాండ్స్’, ‘సేవ్ ఫార్మర్స్’, ‘స్టూడెంట్ పవర్.. నేషనల్ పవర్’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. రాజేంద్రనగర్తోపాటు రాష్ట్రంలోని పాలెం, వరంగల్, సిరిసిల్ల, అశ్వరావుపేట, జగిత్యాల, ఆదిలాబాద్, సంగారెడ్డి వ్యవసాయ కళాశాలల్లోనూ నిరసనలు కొనసాగాయి. శాస్త్రవేత్తలు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు, కొందరు పరోక్షంగా మద్దతు తెలిపినా వారిపై ఉన్నతాధికారులు ఒత్తిడి తెస్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.
వర్సిటీని చీల్చడం సరికాదు
సిరులు పండించడంతోపాటు దేశానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్నం పెడుతున్న గుండెకాయవంటి వ్యవసాయవర్సిటీని చీల్చడం సరికాదని పలువురు వక్తలు సూచించారు. సీఎం రేవంత్రెడ్డి ఇప్పటికీ పీసీసీ అధ్యక్షుడిగానే కాకుండా రాష్ట్ర బాగోగుల గురించి బాధ్యతగా ఆలోచించాలని పేర్కొన్నారు. జీవో నంబర్ 55ని వెనక్కి తీసుకొని, వర్సిటీని కాపాడాలని కోరారు. వర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు రాజ్కుమార్, శ్రీజ, అరవింద్, మధుకర్, సత్యమూర్తి, సురేందర్, దీక్షిత్, భానుచందర్, హరిప్రియ, శిరీష, అరవింద్, వంశీచందర్రెడ్డి, వినయ్రెడ్డి, శంకర్నాయక్, రాకేశ్ పాల్గొన్నారు. కాగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా స్థానిక పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా విద్యార్థులు వ్యవహరించాలని, నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వెంకటరమణ హెచ్చరించారు.
వర్సిటీ భూములు తీసుకోవడం సరికాదు ; సీపీఎం రాష్ట్ర కమిటీ
హైకోర్టు నిర్మాణానికి వ్యవసాయ వర్సిటీ భూములు తీసుకోవడం సరికాదని సీపీఎం రాష్ట్ర కమిటీ పేర్కొన్నది. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన వంద ఎకరాల భూమిని హైకోర్టు నిర్మాణానికి కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 55ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వ్యవసాయ విశ్వవిద్యాలయ భూముల్లో కాకుండా ఇతర ప్రభుత్వ స్థలాల్లో హైకోర్టును నిర్మించాలని కోరింది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కమిటీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం కేటాయించిన భూముల్లో వ్యవసాయం దాని అనుబంధ రంగాలైన పశు సంవర్ధక, ఉద్యాన, పట్టుపరిశ్రమ తదితర రంగాలపై పరిశోధనలతోపాటు ‘బయోడైవర్సిటీ ప్లాంటేషన్’ కొనసాగుతున్నదని ప్రభుత్వానికి గుర్తుచేసింది.