చిక్కడపల్లి, నవంబర్ 10: రాష్ట్రంలో శనివారం ప్రధాని మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ నల్ల బెలూన్లతో నిరసనలు వ్యక్తం చేస్తామని గిరిజన సంఘాల జేఏసీ నాయకులు తెలిపారు. కేంద్రప్రభుత్వం గిరిజనులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, గిరిజన వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనలు కొనసాగుతాయని చెప్పారు. గురువారం గిరిజన సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీడియాతో తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం ధర్మనాయక్, ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీరాంనాయక్, జేఏసీ ప్రధాన కార్యదర్శి రమావత్ అంజయ్య నాయక్, టీఆర్ఎస్ గిరిజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీ రాజలింగం నాయక్, లంబాడి హక్కుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్ నాయక్ మాట్లాడారు. గిరిజన సమాజంపై బీజేపీ నేతలు తీవ్ర వివక్ష చూపుతున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.