కమలాపూర్, ఆగస్టు 17: యువకులను ఉసిగొల్పి ఆత్మహత్యలకు ప్రేరేపించి సానుభూతి పొందేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆరోపించారు. అందులో భాగంగానే యువకులను సెల్ఫోన్ టవర్లు ఎక్కించడం, కార్లపై రాళ్లు వేసుకొని టీఆర్ఎస్ వాళ్లపై నెట్టేందుకు చూస్తున్నదని మండిపడ్డారు. మంగళవారం హనుమకొండ జిల్లా కమలాపూర్లో బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. గోషామహల్ ఎన్నిక ల్లో రాజాసింగ్, దుబ్బాకలో రఘునందన్రావు చేసిన ప్రదర్శనలే రాబోయే ఎన్నికల్లో ఈటల రాజేందర్ చేసే అవకాశం ఉన్నదన్నారు. వీల్ చైర్లో ప్రచారం, అంబులెన్స్ లో పడుకుని ప్రచారం చేసి సానుభూతితో ఓట్లు వేయించుకునేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. ఈటలను హుజూరాబాద్ ప్రజలు రాజీనామా చేయాలని అడిగిండ్రా?,రాజీనామా చేసి ఎన్నికలు ఎందుకు తెచ్చారో చెప్పి ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకే ఈటల రాజీనామా నాటకానికి తెర తీశారని ప్రజలు గమనించాలని కోరారు.
బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్ హుజూరాబాద్ ప్రజలకు ఏం చేస్తరో చెప్పడం మరిచి సీఎం కేసీఆర్ను తిట్టడమే ఎజెండాగా పెట్టుకున్నారని బాల్క సుమన్ దుయ్యబట్టా రు. దళితబంధు పథకం హుజూరాబాద్ నుంచి ప్రారంభం కావడాన్ని గర్వించాల్సింది పోయి విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. ఈటల కప్పుకుంది కాషాయజెండా.. మాట్లాడేది ఎర్రజెండా మాటలని ఎద్దేవా చేశారు. రాబోయే ఉప ఎన్నిక ఓ భూకబ్జాదారుడు, ఓ విద్యార్థి వీరుడికి.. 200 ఎకరాల భూస్వామికి, గుంట భూమిలేని పేదవాడికి.. వెన్నుపోటుదారుడికి, నిజాయితీపరుడికి మధ్య పోటీ అన్నారు. గోడగడియారాలు, కుట్టుమెషిన్లు, మందుబాటిళ్లు పంపిణీ చేయడం ఆత్మగౌరవం అంటరో.. ఆత్మవంచన అంటరో ఈటల చెప్పాలని డిమాండ్ చేశారు.