యాదగిరిగుట్ట: యాదాద్రి ఆలయం ఇల వైకుంఠపురంగా వెలిసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కృషితో భవిష్యత్తులో గొప్ప క్షేత్రంగా విరాజిల్లుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Minister Errabelli Dayakar rao) అన్నారు. తిరుపతి, ఇంద్రకీలాద్రి తరహాలో యాదగిరిగుట్ట (Yadagirigutta) యాదాద్రి (Yadadri) దేవాలయాన్ని పునర్నిర్మించి సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోయారని చెప్పారు. తెలంగాణలో (Telangana) దేవాలయాలకు పూర్వ వైభవం వచ్చిందన్నారు. కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మినరసింహ స్వామివారిని మంత్రి ఎర్రబెల్లి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చరిత్రలో నభూతో న భవిష్యత్తు అన్న చందంగా సీఎం కేసీఆర్ యాదాద్రి దేవాలయాన్ని పునర్ నిర్మించారని చెప్పారు.
దేవాలయం మొత్తం ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అద్భుతంగా ఉందని, నిర్మాణ కౌశలం భక్తి పారవశ్యం పొంగిపొరలే విధంగా జరిగిందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే దేవాలయాలకు పూర్వవైభవం వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి తలపెట్టిన కార్యక్రమాలన్నీ విజయవంతం కావాలని శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని కోరుకున్నట్లు వెల్లడించారు.