హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): తప్పు చేయనివాళ్లు ఎలాంటి విచారణనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు.. తప్పు చేసినవాళ్లు మాత్రం సాకులు చూపుతూ తప్పించుకొనే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో సరిగ్గా ఇదే జరుగుతున్నది. పలు కేసులకు సంబంధించి విచారణకు రాకుండా బీజేపీ నేతలు పారిపోతుంటే… బీఆర్ఎస్ నేతలు మాత్రం ధైర్యంగా విచారణను ఎదుర్కొంటూ తమ నిజాయితీని చాటుతున్నారు. ఇందుకు ఎమ్మెల్యేల ఎర కేసు, ఢిల్లీ మద్యం కేసులే ఉదాహరణగా నిలుస్తున్నాయి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్తోపాటు ఇతర నేతలు విచారణకు రాకుండా తప్పించుకొన్నారు. ఈ కేసుతో తమకు సంబంధం లేదని చెప్తూనే.. కేసులో విచారణను నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేశారు. మద్యం కేసులో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిజాయితీగా సీబీఐ, ఈడీ విచారణకు హాజరై అధికారులకు సహకరించారు.
విచారణకు డుమ్మా కొట్టిన బీఎల్ సంతోష్
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో రెడ్హ్యాండెడ్గా పట్టుబడిన నిందితులే బీజేపీ అగ్రనేతల ప్రమేయం గురించి స్పష్టంగా చెప్పారు. కానీ, కేసులో విచారణకు హాజరుకాకుండా బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్తోపాటు జగ్గుస్వామి, తుషార్ పారిపోయారనే విమర్శలున్నాయి. ఇందుకోసం అవకాశం ఉన్న అడ్డదారులన్నీ తొక్కారనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా బీఎల్ సంతోష్ ఈ కేసులో సిట్ విచారణకు హాజరు కాకుండా విశ్వప్రయత్నాలు చేశారు. గత ఏడాది నవంబర్ 21న విచారణకు హాజరు కావాలని సిట్ ఆయనకు నోటీసులు జారీ చేసింది. కానీ ఆయన హాజరు కాలేదు. ఆ తర్వాత 26 లేదా 28న హాజరు కావాలని మళ్లీ నోటీసులు జారీ చేసింది. అయినప్పటికీ విచారణకు హాజరు కాకుండా కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుతో తనకు సంబంధం లేదని, నోటీసులు రద్దు చేయాలని కోరుతూ నవంబర్ 25న హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆయనతో పాటు మిగిలిన నిందితులు కూడా ఇలాగే చేశారు. బీఎల్ సంతోష్ ఏ తప్పూ చేయకుంటే విచారణ ఎదుర్కొనేందుకు ఎందుకు భయపడ్డారని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ 11 పిటిషన్లు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో తమ పార్టీకి, నేతలకు ఎలాంటి సంబంధం లేదంటూ బీజేపీ నేతలు కల్లబొల్లి కబుర్లు చెప్తూ వచ్చారు. పట్టుబడ్డ నిందితులతో బీజేపీకి సంబంధం లేదని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్రెడ్డి చెప్పారు. కానీ ఆయనే ఈ కేసు దర్యాప్తును నిలిపివేయాలంటూ, సిట్ దర్యాప్తునకు బదులు సీబీఐకి అప్పగించాలంటూ కోర్టులో పిటిషన్ల మీద పిటిషన్లు దాఖలు చేశారు. ఈ విధంగా బీజేపీ నేతల తరుపున సుమారు 11 పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబర్ 26న ఈ వ్యవహారం బయటపడగా.. మరుసటి రోజునే ఆయన హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు. కేంద్ర మంత్రి నేతృత్వంలోని బృందం కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. బీజేపీ నేతలు ఏ తప్పూ చేయకుంటే ఇంత హడావిడి ఎందుకు చేశారని తెలంగాణవాదులు ప్రశ్నిస్తున్నారు.
విచారణను ధైర్యంగా ఎదుర్కొంటున్న కవిత
ఎమ్మెల్యేల ఎర కేసులో బీఎల్ సంతోష్ విచారణ తప్పించుకుంటే… మద్యం కేసులో మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధైర్యంగా విచారణ ఎదుర్కొంటున్నారు. విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నారు. ఇందులో భాగంగానే విచారణకు సమయం ఇవ్వాలని సీబీఐ కోరిన వెంటనే సమయమిచ్చిన కవిత హైదరాబాద్లో తన ఇంటిలో డిసెంబర్ 11వ తేదీన సీబీఐ విచారణను స్వాగతించారు. సుమారు 6 గంటలకు పైగా సీబీఐ విచారణ జరిపింది. ఆ తర్వాత ఇదే కేసులో ఈడీ కూడా విచారణకు రావాల్పిందిగా కవితకు ఈ నెల 8న నోటీసులు జారీ చేసింది.
మద్యం కేసులో కవిత విచారణ వివరాలు..
03-12-2022
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీఆర్పీసీ 160 కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ. అయితే ఆ రోజు షెడ్యూల్ కార్యక్రమాలు ఉన్నందున హాజరు కాలేనని తెలిపిన కవిత. డిసెంబర్ 11వ తేదీన విచారణకు తన ఇంట్లోనే అందుబాటులో ఉంటానని సీబీఐకి సమాధానం ఇచ్చిన కవిత.
11-12-2022
ఆ రోజు సీబీఐ అధికారులు కవిత ఇంటికి వచ్చి సుమారు 6 గంటల పాటు విచారణ జరిపారు. విచారణకు కవిత పూర్తిగా సహకరించారు.
08-03-2023
సీబీఐ విచారణ అనంతరం ఈ నెల 8వ తేదీన ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసు జారీ చేసింది. 9వ తేదీన విచారణకు హాజరు కావాలని సూచించింది. అయితే ఆ రోజు హాజరుకాలేనని, 11వ తేదీన హాజరవుతానని కవిత ఈడీకి సమాధానం ఇచ్చారు.
11-03-2023
చెప్పిన ప్రకారం ఈ నెల 11న కవిత ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణకు సహకరించారు.
ఎమ్మెల్యేల ఎర కేసులో బీజేపీ నేతల తీరు ఇది..
27-10-2022
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసులో నమోదైన కేసు దర్యాప్తు సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం)లేదా సీబీఐతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
28-10-2022
ఎమ్మెల్యేల కొనుగోలు కేసునకు సంబంధించి నమోదైన కేసును సీబీఐకి అప్పగించేలా ఆదేశాలివ్వాలని కేంద్ర ఐటీశాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్సింగ్, అధికార ప్రతినిధి అనిల్ బలూనీ, క్రమశిక్షణ సంఘం సభ్యుడు ఓం పాఠక్ బృందం ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.
28-10-2022
రాష్ట్రస్థాయిలో కొనుగోలు కేసులో నిజాలు నిగ్గుతేల్చాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు లేఖలు రాశారు. స్వయంగా బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారులకు ఫిర్యాదు చేశారు.
04-11-2022
ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐకి ఇవ్వాలంటూ హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేయడాన్ని సుప్రీం కోర్టు సైతం తీవ్రంగా తప్పు పట్టింది.
05-10-11-2022
కేసును సీబీఐకి ఇవ్వాలని కోరుతూ నవంబర్ 10న బీజేపీ హైకోర్టులో రిట్ అప్పీలు దాఖలు
18-11-2022
ఈ కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ జారీ చేసిన నోటీసుల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులివ్వాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జీ ప్రేమేందర్రెడ్డి హైకోర్టు మరో పిటిషన్ దాఖలు చేశారు.
18-11-2022
బీఎల్ సంతోష్కు నోటీసులు జారీ చేసిన సిట్.. 21న విచారణకు హాజరు కావాలని పిలుపు
21-11-2022
నిందితులు దాఖలు చేసిన రెండు పిటిషన్లలో జోక్యం చేసుకోబోమని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాకుండా సిట్ దర్యాప్తు హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలో జరగాలన్న తెలంగాణ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులను రద్దు చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని సీబీఐ లేదా కేంద్రం ఏర్పాటు చేసే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్ ) దర్యాప్తునకు ఆదేశించాలన్న బీజేపీ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.
22-11-2022
ముగ్గురు నిందితులు సిట్ దర్యాప్తుపై స్టే ఇవ్వాలని హైకోర్టులో నవంబర్ 22న పిటిషన్ దాఖలు.
25-11-2022
ఈ కేసుతో తనకు సంబంధం లేదని, నోటీసులు రద్దు చేయాలని హైకోర్టులో బీఎల్ సంతోష్ పిటిషన్.
27-11-2022
నవంబర్ 27న కేసును సీబీఐకి బదిలీ చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి మరో పిటిషన్.
28-11-2022
కేసు విచారణను అడ్డుకోవాలని నిందితుడు తుషార్ కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు