రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ): బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చి తమకు ఉపాధి చూపాలని డిమాండ్ చేస్తూ నేతన్నలు ఆందోళనకు దిగారు. సిరిసిల్ల పట్టణంలోని చేనేత, జౌళి శాఖ కార్యాలయం ఎదుట బుధవారం తెలంగాణ పవర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆసాములు, మరమగ్గాల కార్మికులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి కూరపాటి రమేశ్ మాట్లాడుతూ.. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ప్రస్తుతం తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నదని, కార్మికులకు ఉపాధి లేక పస్తులుండే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడ్డ రూ.482 కోట్లు వెంటనే టెస్కో సంస్థకు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నిధులు ఇవ్వక పోవడం వల్లే బతుకమ్మ చీరల ఆర్డర్లు రావడం లేదని అన్నారు. ఏటా జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ఆర్డర్లు వచ్చేవని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతవరకు ఆర్డర్లు ఇవ్వకపోవడంతో నేత కార్మికులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సిరిసిల్లలో యారన్ బ్యాంకు ఏర్పాటు చేయాలని, 10 హెచ్పీల వరకు మరమగ్గాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేతన్నల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, ఆసాముల సమన్వయ కమిటీ అధ్యక్షుడు సిరిసిల్ల రవీందర్, సీఐటీయూ నాయకులు ఉడుత రవి తదితరులు పాల్గొన్నారు.