హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వల్ల దేశంలో వచ్చే జనవరి నుంచి కొవిడ్-19 కేసులు పెరుగవచ్చని ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ కాన్పూర్ నిపుణులు అంటున్నారు. ఒమిక్రాన్పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్నప్పటికీ సెకండ్ వేవ్ స్థాయిలో ఈసారి పరిస్థితులు ప్రమాదకరంగా మారకపోవచ్చని చెప్తున్నారు. ఐఐటీ కాన్పూర్కు చెందిన ఎం అగర్వాల్, ఐఐటీ హైదరాబాద్కు చెందిన ఎం విద్యాసాగర్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్కు చెందిన ఎం కనిత్కర్తో కలిసి గతంలో ‘సూత్ర’ పేరుతో ఒక గణిత సూత్రాన్ని ప్రతిపాదించారు. కరోనాకు సంబంధించి ప్రపంచవ్యాప్త పరిస్థితులు, దేశంలో నమోదవుతున్న కేసులను ఎప్పటికప్పుడు విశ్లేషిస్తూ రాబోయే కొన్ని రోజుల్లో కొవిడ్ తీవ్రతను అంచనా వేస్తున్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో దేశంలో తక్కువ తీవ్రతతో థర్డ్వేవ్ రావొచ్చని అంచనా వేశారు. సంక్రాంతికి కేసుల సంఖ్య పెరుగుతూ ఫిబ్రవరిలో పతాకస్థాయికి చేరుతాయని, మార్చి నాటికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. ఈ ఏడాది మార్చి/ ఏప్రిల్ నుంచి అతలాకుతలం చేసిన డెల్టా కన్నా ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రోజుకు 1.5-2 లక్షల కేసులు
సెకండ్ వేవ్లో డెల్టా తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా రోజువారీ కేసులు 4.5 లక్షల వరకు నమోదయ్యాయి. ఒమిక్రాన్ వల్ల పతాక స్థాయిలోనూ కేసుల సంఖ్య 1.5-2 లక్షలకు మించి ఉండకపోవచ్చని అంటున్నారు. ఇందుకు రెండు కారణాలు చెప్తున్నారు.
సెకండ్ వేవ్ నాటికి దేశ వైద్యరంగంలో మౌలిక వసతులు పూర్తిస్థాయిలో లేవు. పైగా వ్యాక్సినేషన్ కూడా చాలా తక్కువ సంఖ్యలో జరిగింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ వేగంగా జరుగుతున్నది. కాబట్టి సెకండ్వేవ్ స్థాయిలో ఈసారి కేసులు ఉండకపోవచ్చు. పైగా దేశవ్యాప్తంగా వైద్యరంగం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉన్నది. – ఎం విద్యాసాగర్, ఐఐటీ హైదరాబాద్
ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం టీకాలు 2 డోసులు వేసుకున్నవారిపై వేరియంట్ ప్రభావం పెద్దగా లేదు. 18 ఏండ్లకు పైబడినవాళ్లంతా టీకాలు తీసుకొని, కరోనా జాగ్రత్తలు పాటిస్తేనే ఒమిక్రాన్ గండం నుంచి బయటపడొచ్చు.
– శ్రీనివాసరావు, డీఎంహెచ్