CAPF Constable exam | హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ దెబ్బకు కేంద్రం దిగొచ్చింది. భిన్న భాష లు, భిన్న సంప్రదాయాలున్న దేశంలో ఫెడరల్ స్ఫూ ర్తి పరిఢవిల్లాలని మంత్రి కేటీఆర్ చేసిన కృషికి ఫలి తం దకింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పోటీ పరీక్షలను ఇక నుంచి 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నట్టు ప్రకటించింది. దేశవ్యాప్తంగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్)లో 1.30 లక్షల కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి కేంద్ర హోంశాఖ ఏప్రిల్ 6న నోటిఫికేషన్ జారీచేసింది. ఈ పరీక్షలను ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో మాత్రమే నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నది. దీనిపై మత్రి కేటీఆర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. దేశంలో ఆయా రాష్ర్టాల స్థానిక భాషల్లోనూ పరీక్షలు నిర్వహించి, దేశవ్యాప్తంగా నిరుద్యోగులు నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేస్తూ కేటీఆర్ లేఖాస్త్రం సంధించిన నేపథ్యంలో కేంద్రం తన తప్పిదాన్ని సరిదిద్దుకున్నది. హిందీ, ఇంగ్లిష్తోపాటు రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో పొందుపరిచిన అన్ని భారతీయ భాషల్లో పోటీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. మంత్రి కేటీఆర్ చొరవతో కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల దక్షిణాదికి చెందిన లక్షలాది నిరుద్యోగ యువతకు లబ్ధి చేకూరనున్నది.
కేంద్రం రాజకీయం.. కేటీఆర్ తీవ్ర అభ్యంతరం
కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి దక్షిణాది అంటే ఆది నుంచీ వివక్షే. చివరికి ఉద్యోగ నియామకాల్లోనూ ఉత్తరాదికే మేలు జరిగేలా ప్రవర్తిస్తున్నది. గతంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) ఉద్యోగాల విషయంలోనూ కేంద్రం ఇలాగే వ్యవహరిస్తే.. సీఎం కేసీఆర్ తీవ్రంగా విమర్శించారు. ప్రధానికి లేఖ రాశారు. దిగొచ్చిన కేంద్రం ఎస్సెస్సీ పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తామని ప్రకటించింది. కానీ, సీఏపీఎఫ్ ఉద్యోగాల విషయంలో తొలుత వక్రబుద్ధినే కొనసాగించింది. దీనిపై తెలంగాణతోపాటు దక్షిణాదికి చెందిన ఏ ఒక్క బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే నోరుమెదప లేదు. సీఆర్పీఎఫ్లో భారీగా ఉద్యోగాల భర్తీ కి విడుదల చేసిన నోటిఫికేషన్ను సవరించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
ఈ పరీక్షను హిందీ, ఇంగ్లిష్లోనే కాకుండా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఇతర అధికారిక ప్రాంతీయ భాషల్లో సైతం నిర్వహించాలని కోరారు. హిందీ, ఇంగ్లిష్ భాషల్లో నిర్వహించడంతో ఆంగ్ల మాధ్యమంలో చదవనివారు, హిందీయేతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్ విజ్ఞప్తితో దిగొచ్చిన కేంద్రం సీఏపీఎఫ్ (బీఎస్ఎఫ్, ఐటీబీపీ, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, అస్సోం రైఫిల్ వంటి బలగాలు) భర్తీ పరీక్షలు అన్నింటికీ హిందీ, ఇంగ్లిష్తోపాటు తెలుగు, ఉర్దూ, తమిళం, మలయాళం, కన్నడ, అస్సామీ, బెంగాలీ, గుజరా తీ, కొంకణి, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ భాషల్లోనూ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకు కేంద్ర మంత్రి అమిత్షాకు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ర్టాల నుంచి పరీక్ష రాసే వేలాది అభ్యర్థులకు లబ్ధి చేకూరుతుందని కేటీఆర్ ట్వీట్ చేశారు.
మోదీకి రెండేండ్ల క్రితమే ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ
భాష కారణంగానే యువత ఉద్యోగావకాశాలు కోల్పోకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ 2020 నవంబర్ 18న ప్రధాని మోదీకి లేఖ రాశారు. యూపీఎస్సీ, ఎస్సెస్సీ తదితర కమిషన్లు నిర్వహించే పరీక్షలు తెలుగుతోపాటు అన్ని ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని సూచించారు. అప్పుడే దేశంలోని అన్ని ప్రాంతాలకు సమన్యాయం దక్కినట్టు అవుతుందని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. కేసీఆర్ లేఖకు కేంద్రం దిగొచ్చింది. వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లోని గ్రూప్ బీ, గ్రూప్సీ ఉద్యోగాల కోసం నిర్వహించే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలను హిందీ, ఇంగ్లిష్తోపాటు మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తామని అప్పట్లో కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.