నిర్మల్ అర్బన్/ఎదులాపురం: ప్రభుత్వ దవాఖానలో పేదలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా సర్కారు ముందుకెళ్తున్నదని దేవాదాయశాఖ మంత్రి ఆల్లోల ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. బుధవారం ఆదిలాబాద్లోని రిమ్స్, నిర్మల్ జిల్లా కేంద్రంలోని దవాఖానలో డయాగ్నస్టిక్ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కేంద్రాల్లో కరోనా పరీక్షలతోపాటు రక్త, మూత్ర పరీక్ష, బీపీ, షుగర్ తదితర 57 రకాల పరీక్షలను నిర్వహించనున్నట్టు తెలిపారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రధాన దవాఖానలో జిల్లాలోని వివిధ పీహెచ్సీ నుంచి రక్తనమూనాలను సేకరించే ఐదు వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్లు జనార్దన్ రాథోడ్, కొరిపెల్లి విజయలక్ష్మి, ఎమ్మెల్యే జోగు రామన్న, టీడీడీసీ చైర్మన్ లోక భూమారెడ్డి, కలెక్టర్లు సిక్తా పట్నాయక్, ముషారఫ్ అలీ ఫారుఖీ పాల్గొన్నారు.