సంగారెడ్డి, జనవరి 8 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ సర్కార్ మంజూరు చేసిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని సంగారెడ్డి జడ్పీ సర్వసభ్య సమావేశం అభిప్రాయపడింది. సోమవారం జడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్రెడ్డి అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశానికి ఎంపీ బీబీపాటిల్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, సునీతారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్పీ వైస్చైర్మన్ కుంచాల ప్రభాకర్ మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ మంజూరు చేసిన ఎస్డీఎఫ్ పనులు జరగకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆరోపించారు.
ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, సునీతాలక్ష్మారెడ్డి, మాణిక్రావు మాట్లాడుతూ కేసీఆర్ సర్కారు మంజూరు చేసి ఇంకా ప్రారంభం కాని ఎస్డీఎఫ్, ఏసీడీఏపీ ఇతర పనులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడం సరికాదని అన్నారు. దీనిపై పంచాయతీరాజ్ శాఖ ఈఈ జగదీశ్వర్ స్పందిస్తూ.. అందోలు నియోజకవర్గం మినహాయించి మిగతా నాలుగు నియోజకవర్గాల్లో ప్రారంభంకాని పనులు నిలిపివేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించినట్టు తెలిపారు. దీంతో ఎమ్మెల్యేలు సునీతాలక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఎస్డీఎఫ్ సహా అన్ని పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జడ్పీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల డిమాండ్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి సైతం మద్దతు పలికారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో కూడా ప్రారంభం కాని పనులు కొనసాగాలని తాను కోరుకుంటున్నానని తెలిపారు. ఎస్డీఎఫ్ పనులు నిలిపివేయాలని మంత్రి దామోదర చెప్పకపోవచ్చని, తాను మంత్రితో మాట్లాడతానని పేర్కొన్నారు. ఎంపీ బీబీపాటిల్ పాటిల్ మాట్లాడుతూ.. జిల్లా రైతులకు మేలు చేసే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలను కొనసాగించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వంలో దళితబంధు, బీసీబంధు, మైనార్టీ సంక్షేమ పథకాల కింద ఎంపికైన లబ్ధిదారులకు యథావిధిగా ఆర్థికసాయం అందజేయాలని సూచించారు.