నిన్న గాంధీభవన్లో పార్టీ పెద్దలందరి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ యూటర్న్ తీసుకున్నారు. కాంగ్రెస్పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు డీఎస్ ఇవాళ లేఖ విడుదల చేశారు. డి శ్రీనివాస్ సతీమణి లేఖను మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖ డీఎస్ రాసిన లేఖ అంటూ ఆయన భార్య మాట్లాడిన వీడియో బయటికొచ్చింది. కాంగ్రెస్ పార్టీ వాళ్లు మా ఇంటి వైపు రాకండి, డీఎస్ అనారోగ్యంతో ఉన్నారు, మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు అంటూ ఆ వీడియోలో డీఎస్ భార్య మాట్లాడారు. లేఖపై డీఎస్ స్వయంగా సంతకం చేస్తన్నట్లు వీడియోలో కనిపిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఆయనకు అత్యంత సన్నిహితుల మధ్య ఎంతో సంతోషంగా పెద్ద కుమారుడు సంజయ్తో పాటు కాంగ్రెస్లో చేరిన డీఎస్కు ఏమైందో కానీ ఇవాళ రాజీనామా చేస్తున్నట్లు లేఖ విడుదల చేశారు.
తన తండ్రి రాజీనామా వేనుక తమ కుటుంబానికి చెందిన బీజేపీ నాయకుడి హస్తం ఉందని తమ్ముడి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడని డీఎస్ పెద్ద కుమారుడు డి సంజయ్ ఆరోపించారు. ఇది పక్కా అరవింద్ పనే అని సంజయ్ స్ఫష్టం చేశారు. నిన్న తన తండ్రి డీ శ్రీనివాస్ ఎంతో సంతోషంగా అందరి సమక్షంలో మీడియా సాక్షిగా కాంగ్రెస్ కండువా ప్పుకున్నారని, సుమారు మూడు గంటలు గాంధీభవన్లో ఉన్నారని సంజయ్ అన్నారు. ఉన్నట్టుండి ఇవాళ రాజీనామా అంటూ తన తల్లి లేఖను విడుదల చేయడాన్ని సంజయ్ తప్పు పట్టారు. ఇదంతా అరవింద్ పనేనని సంజయ్ చెప్పారు. తన తండ్రికి ప్రాణహాని ఉందని, తండ్రిని చంపడానికి తన తమ్ముడు కుట్ర చేస్తున్నాడని సంజయ్ ఆరోపించారు.
ఇదంతా చూస్తుంటే ఫ్యామిలీ రాజకీయ వార్లో డిఎస్ నలిగిపోతున్నారా? అనే అనుమానం కలుగుతున్నది. తన ఇద్దరి కొడుకుల మద్య డి శ్రీనివాస్ ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తున్నది. నిన్న తానే స్వయంగా పార్టీలో చేరి ఇవాళ రాజీనామా చేయడం చూస్తుంటే అరవింద్ ఒత్తిడితోటే ఇవాళ రాజీనామా చేశారా? అన్న సందేహం కలుగుతున్నది.