హైదరాబాద్, జూన్ 24 (నమస్తే తెలంగాణ): కృష్ణా నదిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన నీటిని తరలించేందుకు ప్రభుత్వం మరో కీలక అడుగువేసింది. ఇటీవల క్యాబినెట్లో ఆమోదించిన జోగులాంబ బరాజ్ సహా నూతనంగా ఆరు ప్రాజెక్టుల సర్వేకు అనుమతులు ఇస్తూ గురువారం నీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రజత్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణాబేసిన్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను తరలించేందుకు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్కు తాగునీరు అందించనున్నట్టు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా నదిపై చట్టవిరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. ఎన్జీటీ ఆదేశాలను ధిక్కరిస్తూ అక్రమంగా పనులు కొనసాగిస్తూ భారీగా నీటిని తరలించేందుకు ఆ రాష్ట్రం సిద్ధమవుతున్నది. ఈ జలదోపిడీని అడ్డుకోవాలని క్యాబినెట్ ఇటీవల నిర్ణయించింది. ఓవైపు ఏపీ అక్రమ ప్రాజెక్టులపై పోరాడుతూనే.. మరోవైపు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు కృష్ణానదిపై కొత్త ప్రాజెక్టులు నిర్మించాలని నిర్ణయించింది. ప్రధానంగా జోగులాంబ బరాజ్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ తాజాగా సర్వేకు అనుమతులు ఇచ్చింది.