హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ) : గ్రూప్ -4 ఫలితాలను టీఎస్పీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. 300 మార్కులకు 220.458 మార్కులతో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాసి టాపర్గా నిలిచాడు. టాప్ -10లో 9 మంది పురుషులు నిలువగా, ఒకే ఒక్క మహిళా అభ్యర్థి టాప్-10లో చోటు సంపాదించారు. మొత్తం 7,26,837 మంది అభ్యర్థుల మెరిట్ జాబితాను టీఎస్పీఎస్సీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. గత కేసీఆర్ ప్రభుత్వం 8,180 గ్రూప్ -4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది. 2023 జూలై 1న గ్రూప్ -4 పరీక్ష నిర్వహించారు. 9.51 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 7.26 లక్షల మంది ఈ పరీక్షకు హాజరయ్యారు.
అభ్యర్థులు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ర్యాంకులు చూసుకోవవచ్చని అధికారులు సూచించారు. ఈ ఫలితాల్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి 300 మార్కులకు ఒకే ఒక్క మార్కును (1.020) సాధించి, చివరిస్థానంలో నిలిచాడు. ఇక రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక్కరు 10.318 మార్కులు, వికారాబాద్ జిల్లా అభ్యర్థి 11.425, హైదరాబాద్ జిల్లా అభ్యర్థి 12.445, నాగర్కర్నూల్ జిల్లా అభ్యర్థి 14.524 మార్కులతో కింది నుంచి ఐదు స్థానాల్లో నిలిచారు. అయితే ప్రస్తుతానికి జనరల్ ర్యాంకులను ప్రకటించారు. అయితే రోస్టర్, స్థానికత అధారంగా అభ్యర్థులను ఉద్యోగులకు ఎంపికచేస్తారు. త్వరలోనే సర్టిఫికెట్ వెరిఫికేషన్ షెడ్యూల్ కూడా టీఎస్పీఎస్సీ విడుదల చేయనున్నది.