హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం హైదరాబాద్లోని బంజారా భవన్లో గిరిజనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 22వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు జరుగనున్నాయి. తొలి రోజు బంజారాల బిందెల నృత్యం, ఎరుకలు పూడి నృత్యం ప్రదర్శించారు. బంజారా, ఎరుకల పెయింటింగ్స్, ఎరుకల తట్టలు, బుట్టలు, బంజారా ఎంబ్రాయిడరీ వస్తువులు, ఫ్యాషన్ ఆభరణాలు, గిరిజన ఔషధాలు, ఫొటోగ్రఫీ, ఫ్యాషన్ దుస్తులు ప్రదర్శన, అమ్మకానికి అందుబాటులో ఉంచారు.
ఈ ప్రదర్శన శనివారం కూడా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. 5, 6 తేదీల్లో కోయ, నాయక్పోడ్ గిరిజనుల హస్తకళలు, నృత్యాలు.. 8, 9 తేదీల్లో తోటి, కోలామ్, కొండరెడ్డి, చెంచు హస్తకళలు, నృత్యాలు.. 12న, 13న గోండ్, పర్ధాన్, ఆంద్ గిరిజన తెగల నృత్యాలు, హస్తకళలు ప్రదర్శిస్తారు. 14, 15న గిరిజనులకు రాజ్యాంగం కల్పించిన హక్కులపై చర్చాగోష్టి కార్యక్రమాలుంటాయి.