హిమాయత్నగర్, మే16: కేంద్ర ప్రభు త్వ అసమర్థత విధానాలతోనే దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ విమర్శించారు. సీపీఐ నగర సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ శనివారం హిమాయత్నగర్ వై జంక్షన్లో ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా సిలిండర్, ఆటోకు తాళ్లు కట్టి గుంజుతూ వినూత్న నిరసన తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన బీజేపీ పేదల సంక్షేమాన్ని విస్మరించిందని మండిపడ్డారు. కేవలం బడా కార్పొరేట్ శక్తులకు మాత్రమే ప్రయోజనం చేకూరేలా పాలన సాగిస్తున్నదని దుయ్యబట్టారు. ప్రధాని మోదీ సంక్షోభ నివారణ చర్యలు చేపట్టకుండా పొదుపు మంత్రాన్ని జపిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎస్ ఛాయాదేవి, నగర కార్యదర్శి స్టాలిన్, సహాయ కార్యదర్శి కమతం యాదగిరి, నేతలు పీ ప్రేంపావని, బీ వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.