మేడ్చల్ మల్కాజ్గిరి : కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మంత్రి మల్లారెడ్డి, రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ కలిసి జమ్మి మొక్కను నాటారు. ఈ సందర్భంగా కీసర రామ లింగేశ్వర స్వామి ఆలయంలో మల్లారెడ్డి, సంతోష్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ఊరు ఉరికో జమ్మిచెట్టు, గుడి గుడికో జమ్మిచెట్టు కార్యక్రమం ఉద్యమంలా కొనసాగుతుందన్నారు. దసరా పండుగ సందర్భంగా జమ్మి చెట్టుకు పూజలు చేయడం మన తెలంగాణ రాష్ట్ర సాంప్రదాయమన్నారు. ప్రతి ఒక్కరూ ఇదే విధంగా గుడిలో, ప్రతి ఊరిలో జమ్మి మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. దసరా పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, కీసర సర్పంచ్ మాధురి వెంకటేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.