హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ఎంసెట్లో రాష్ట్ర గురుకులాల విద్యార్థులు సత్తాచాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్లో మంచి ర్యాంకులు సాధించారు. మంచి అవకాశాలు కల్పిస్తే విద్యకు పేదరికం అడ్డురాదని మరోసారి నిరూపించారు. సాంఘిక సంక్షేమ విద్యార్థులు 1,739 మంది అర్హత సాధిస్తే, గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థులు 928 మంది మెరుగైన ర్యాంకులు తెచ్చుకున్నారు. 125 మంది ఐదువేలలోపు ర్యాంకులు సాధించగా, 82 మంది 10 వేలలోపు ర్యాంకులు కైవసం చేసుకున్నారు. కరోనా నేపథ్యంలో నిర్వహించిన ఆన్లైన్ తరగతులతోనూ ఇంతటి అద్భుత విజయాలను సాధించిన విద్యార్థులకు, వారిని తీర్చిదిద్దిన అధ్యాపక, ఉద్యోగ సిబ్బందికి గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి రోనాల్డ్రోస్ అభినందనలు తెలిపారు.