హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): గోదావరి-కావేరీ అనుసంధానం ప్రాజెక్టులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలం ఇచ్చంపల్లి వద్ద 87 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మించనున్నట్టు జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) తేల్చి చెప్పింది. ఈ మేరకు ముసాయిదా డీపీఆర్ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. ఇందులో బరాజ్ నిర్మాణ ప్రదేశం, నీటి లభ్యత, కేటాయింపులపై తెలంగాణ లేవనెత్తిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసింది. నెలాఖరులోగా అభ్యంతరాలు/ సూచనలు/సలహాలు తెలియజేయాలని ఎన్డబ్ల్యూడీఏ సూచించింది. లేకపోతే ఆమోదించినట్టుగా (డీమ్డ్ టు అప్రూవల్) భావిస్తామని స్పష్టం చేసింది. ఆ తర్వాత తెలంగాణ, ఏపీ, ఛత్తీస్గఢ్, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంతకాలు తీసుకుంటామని తెలిపింది. ఎన్డబ్ల్యూడీఏ నదుల అనుసంధానంపై ఇన్నేండ్లుగా మౌనంగా ఉండి, సార్వత్రిక ఎన్నికల వేళ డీపీఆర్ను పంపడంపై నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పైగా నెలాఖరులోగా అభ్యంతరాలు తెలుపాలని, సీఎంలు సంతకాలు చేయాలన్న నిబంధనపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని గుర్తు చేస్తున్నారు. ఆయా రాష్ట్రాల సీఎంలు సంతకాలు చేయాలంటే ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్రం చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.