వచ్చే నాలుగు వారాలు భద్రం : డీహెచ్ శ్రీనివాసరావు
హైదరాబాద్, డిసెంబర్ 30 : రాష్ట్రంలో రెండుమూడు రోజులుగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయని, పరిస్థితి ఇలాగే కొనసాగితే సంక్రాంతి తర్వాత థర్డ్వేవ్ వచ్చే అవకాశం ఉందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు సూచించారు. గురువారం కోఠిలోని తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలోనూ కొవిడ్ కేసుల్లో ఒకేరోజు 19 శాతం పెరుగుదల కనిపించిందని చెప్పారు. ప్రతిఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలు, పండుగలు జరుపుకోవాలని కోరారు. దేశంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి ప్రారంభమైందని, 32 శాతం ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్నా.. బాధితులు తక్కువ కాలంలోనే కోలుకుంటున్నారని చెప్పారు. ఇతర దేశాలలో ఐసోలేషన్ గడువును తగ్గించారని, మన దేశంలోనూ కొద్దికాలం మాత్రమే థర్డ్వేవ్ ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత మరో వేవ్ రాకపోవచ్చని డీహెచ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు వచ్చే నాలుగు వారాలు జాగ్రత్తగా ఉండాలని, వీలైనంతవరకు ఇండ్లల్లోనే ఉండాలని, బహిరంగ ప్రదేశాలకు వెళ్లాల్సి వస్తే మాస్కులు ధరించి భౌతికదూరం పాటించాలని సూచించారు. మొదటి రెండు వేవ్ల అనుభవంతో థర్డ్వేవ్ను ఎదుర్కొనేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. వ్యాక్సినేషన్ను కొనసాగిస్తూ పడకలు, మందుల కొరతరాకుండా చూసుకుంటున్నామన్నారు. నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్లో తెలంగాణ మూడో స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు.
ఐదుగురికి ఒమిక్రాన్?
రిస్క్ దేశాల నుంచి హైదరాబాద్ విమానాశ్రయానికి గురువారం 143 మంది వచ్చారు. వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్గా తేలింది. ర్యాండమ్గా నిర్వహించిన పరీక్షల్లో మరొకరికి పాజిటివ్ వచ్చింది. వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపించారు.
కొత్తగా 280 కరోనా కేసులు
రాష్ట్రంలో గురువారం కొత్తగా 280 కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 167, మేడ్చల్ మల్కాజిగిరిలో 24, రంగారెడ్డిలో 29 కేసులు నిర్ధారణ అయ్యాయి. 3,563 మంది చికిత్స పొందుతున్నారు. 206 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. కరోనా ఇతర వ్యాధులతో ఒకరు మృతిచెందినట్టు వైద్యారోగ్యశాఖ తెలిపింది.