న్యూఢిల్లీ : ఒకనాడు తెలంగాణ లేక ఏడ్చింది. వనరులు ఉండి కూడా పాలకుల నిర్లక్ష్యం మూలంగా ఉత్పత్తులు లేక ఏడ్చింది తెలంగాణ. నేడు వనరులను స్వదినియోగం చేసుకొని అద్భుతమైన పరిపాలనా తీరుతో కేసీఆర్ నాయకత్వంలో అద్భుతమైన వ్యవసాయ ఉత్పత్తులు వచ్చినంక ఉత్పత్తులను రెగ్యురేట్ చేసే కేంద్రం తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించని కారణంగా.. ఈరోజు తెలంగాణ రైతులు బాధపడాల్సిన అవసరం వచ్చింది.. అని మంత్రి నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి యాసంగి వడ్ల కొనుగోలు అంశంపై నిర్దిష్టమైన నిర్ణయం కోసం న్యూఢిల్లీలో తెలంగాణ మంత్రులు, ఎంపీలు పడిగాపులు కాస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రులు, ఎంపీల బృందం తాజాగా ఢిల్లీలో ప్రెస్మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి.. రైతు దినోత్సవం రోజున తెలంగాణ రైతాంగ పక్షాన.. గత 6 రోజులుగా ఢిల్లీలోనే ఉండి కేంద్రప్రభుత్వ నిర్ణయం కోసం పడిగాపులు కాస్తున్నామన్నారు.
గత 14 నెలల నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన లక్షలాది రైతులు గడ్డ కట్టే చలిలో వాళ్లు కొనసాగించి నిరసన తీరు మళ్లీ మాకు గుర్తొచ్చింది. ఈ దేశానికి అన్నం పెట్టే రైతులు ప్రభుత్వం వద్ద యాచించాల్సిన స్థితి కొనసాగుతోంది. అది మారాలి. రైతు దినోత్సవం రోజునాడు అయినా కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలి. చరిత్రలో నిలిచిపోవడానికి కొన్నిసాహసోపేత నిర్ణయాలు తీసుకోవాలి. అవే చరిత్రలో నిలుపుతాయి. సాధారణ నిర్ణయాలు, సాధారణ పరిపాలన అందరూ చేసేదే. వినూత్నంగా చేసి ప్రజలకు ఒక కొత్త దారి చూపించడమే దార్శనికత. రైతుల స్థితిగతుల మీద ఎటువంటి పట్టింపు లేదు కేంద్రానికి. వ్యవసాయం అనేది స్థిరమైనటువంటి స్వయం ఉపాధిని ఇచ్చేటువంటి రంగం. ప్రభుత్వాల కొద్దిపాటి తోడ్పాటుతో కోట్లాది మంది తమకు తాము బతికేటువంటి పరిస్థితి ఉన్న రంగం. ఇంకేమైనా ఉపాధి రావాలంటే ప్రైవేటు లేదంటే ప్రభుత్వం పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. ఈ రంగంలో ప్రతి క్షణం రైతు ఇన్వాల్వ్ అవుతాడు. రైతే కష్టపడతడు. ప్రభుత్వాలు కొద్ది పాటి ప్రోత్సాహకం ఇస్తే చాలు.
గత రెండు మూడు నెలల నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ రావడం.. మంత్రులము రావడం.. కేంద్ర మంత్రులను కలవడం.. ఇవన్నీ దేనికంటే.. అన్ని రకాల పంటలకు అనువుగా ఉండే రాష్ట్రాలు నాలుగే. వాటిలో తెలంగాణ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఉన్నాయి. ఇవే అన్ని రకాల పంటలకు, అన్ని రకాల వాతావరణాన్ని తట్టుకొని అధిక దిగుబడి ఇచ్చే రాష్ట్రాలు ఇవి. ఏడేళ్ల నుంచి సీఎం కేసీఆర్ తీసుకున్న సాహసోపేతమైన, నూతనమైన సాగుకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల.. తెలంగాణ భారతదేశంలో అతి ఎక్కువగా వ్యవసాయ ఉత్పత్తులను సాధించి.. ఉత్పత్తుల మార్కెట్ విషయంలో కేంద్రం దగ్గర దాపురించాల్సిన దుస్థితి ఏర్పడింది.. అని మంత్రి అన్నారు.