Niranjan Reddy | వరిధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మాటిచ్చారని.. దాని ప్రకారమే లేఖ కోసం వేచి చూస్తున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. మొన్న మాటిచ్చిన మంత్రి నుంచి ఇప్పటి వరకు ఉలుకు లేదు.. పలుకు లేదు. వాళ్ల నిర్ణయం కోసం ఇక్కడ పడిగాపులు కాస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు.
ప్రేమలేఖలు ఇవ్వడానికో.. ప్రేమించడానికో తాము ఢిల్లీకి రాలేదని.. లక్షల మంది జీవితాలతో ముడిపడిన రైతుల సమస్యల గురించి ఇక్కడికి వచ్చామని.. రైతుల కోసం వచ్చామని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. రైతుల సమస్యల విషయంలో కేంద్రానికి ఎందుకు చిత్తశుద్ధి లేదు. రైతుల పట్ల కేంద్రానికి ఎందుకు ఎలాంటి పట్టింపు లేదని మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణ మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ఎర్రబెల్లి దయాకర్రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎంపీలు ఢిల్లీలోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి నిరంజన్ రెడ్డి.. తెలంగాణ చేసిన తప్పేంటి అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న సాహసోపేత నిర్ణయాలే తెలంగాణలోని వ్యవసాయ ఉత్పత్తులకు నిదర్శనం అన్నారు.
కొన్ని సాహసోపేత నిర్ణయాలే తీసుకుంటే.. అద్భుతమైన ఫలితాలు ఏ రంగంలో అయినా ఎలా వస్తాయో.. ఇవాళ కేసీఆర్ నిర్ణయాల మూలంగా తెలంగాణలో వచ్చిన వ్యవసాయ ఉత్పత్తులే ఒక ఉదాహరణ. ఇవి మేము చెప్పుకోవడం కాదు. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని శాఖలు నీటి పారుదలకు సంబంధించి.. ఎరువులకు సంబంధించి.. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి.. ఎఫ్సీఐకి సంబంధించి ఈ సంస్థలన్నీ భిన్న సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వ పనితీరును ప్రశంసించినవే. ఇవి మేము సొంతడబ్బా కొట్టుకునేది ఏం లేదు. ఇవాళ బాధ్యత లేక.. అవగాహన లేక కొంతమంది తోచింది మాట్లాడుతున్నారు. తలా తోక లేకుండా మాట్లాడుతున్నారు. ఒక ప్రభుత్వానికి ప్రభుత్వానికి సంబంధం ఉన్నప్పుడు ప్రభుత్వంగా వచ్చి మాకు కావాల్సింది ఇది అని డిమాండ్ చేయడం మా బాధ్యత. వీళ్లను ఎవరు రమ్మన్నరు అని ఒకాయన అంటడు. అసలు నువ్వెవరిమి మధ్యలో మాట్లాడటానికి. నువ్వు బాధ్యత వహిస్తవ. ఇటువంటి వాళ్లు మాట్లాడటానికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వమే. కేంద్రమే ఒక రాజకీయ పార్టీలాగా వ్యవహరిస్తోంది. చాలా దురదృష్టకరం. మేము ఏదో పనిలేక వచ్చినటువంటి భావనతో చులకనగా మాట్లాడుతారా? రైతుల కష్టాలు అంటే మీకు అంత అలవోకగా ఉందా? కార్పొరేట్లకు మాత్రమే మీరు రెడ్ కార్పెట్ పరుస్తారా? కోట్లా మంది ప్రజలకు సంబంధించిన విషయం గురించి నిర్ణయం తీసుకోమంటే ఇలా చేయడం ఏంటి.
బాయిల్డ్ రైస్ గురించి ఇక మేము మాట్లాడం. యాసంగిలో వరి వేయం. మీరు వద్దన్నరు కాబట్టి వేయం. రైతాంగానికి కూడా చెప్పాం. రా రైస్ అనేటువంటిది.. వానాకాలంలో వచ్చేటువంటిది ఎంత వస్తే అంత కొనుగోలు కేంద్రాల్లో తీసుకుంటాం అని చెప్పారు కదా మీరు.. అది రాసివ్వండి రాతపూర్వకంగా. మీరు ఇచ్చిన 60 లక్షల మెట్రిక్ టన్నుల గడువు అయిపోయింది. అయిపోయేకంటే మూడు రోజుల ముందే వచ్చి చెప్పినం. పెంచండి దాన్ని. ఇవాళ్టికి ఆరు రోజులు అవుతోంది. పెంచండి దాన్ని. చెప్పిన దాన్నే రాతపూర్వకంగా ఇవ్వండి. కొనుగోలు కేంద్రాలు కంటిన్యూ అవుతున్నాయి. రైతాంగం చలిలో కల్లాల వద్ద ఎదురుచూస్తున్నారు అంటే.. ఒకటి రెండు రోజుల్లో ఏదైంది చెబుతాం అన్నారు. అదే ఎదురుచూస్తున్నాం ఇవాళ్టి దాకా. చెప్పాలి కదా ఏదో ఒకటి. చెప్పమనే కోరుతున్నాం. ఏం చెబుతుందో చూద్దాం. ఈలోపల మధ్యలో వచ్చి కొందరు అవమానకరంగా మాట్లాడుతున్నారు. రైతుల సమస్యల మీద ఇక్కడ పడిగాపులు కాసి చూస్తుంటే మీకు తమాషాగా ఉందా.. అని మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
కేంద్ర అడ్డంకులు సృష్టించకుంటే ఈ యాసంగిలో 70 లక్షల ఎకరాల్లో.. పంట పండేది. భవిష్యత్తులో 90 లక్షల ఎకరాలకు వరిసాగు వెళ్లేది. ఒక రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే.. సహకారం అందించాల్సిన కేంద్రమే అడ్డంకులు సృష్టిస్తోంది. తెలంగాణకు నీళ్లు తీసుకురావడం తప్పా? రైతుబంధు ఇవ్వడం తప్పా? రైతుభీమా ఇవ్వడం తప్పా? ఉచిత కరెంట్ ఇచ్చి రైతాంగాన్ని ప్రోత్సహించడం తప్పా. దురదృష్టవశాత్తు కొనుగోళ్లు, గోదాంలు కేంద్రం చేతిలో ఉన్నాయి. అందుకే కేంద్రాన్ని అడగాల్సి వస్తుంది. కేంద్రానికి చేతగాకపోతే హక్కులు రాష్ట్రాలకు బదలాయించాలి అని నిరంజన్ రెడ్డి తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Minister Harish Rao | హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం : మంత్రి హరీశ్ రావు