హైదరాబాద్ : తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు లేఖ రాశారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ పనులను రెండుగా చూపటంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. గెజిట్ 1,2 షెడ్యూళ్ల నుంచి రెండో కాంపొనెంట్ తొలగించాలని మురళీధర్ లేఖలో పేర్కొన్నారు. 10 టీఎంసీలకు సంబంధించిన పనులు అదనపు కాంపోనెంట్ కిందకు రావని… ఉమ్మడి ఏపీలో ఆయకట్టును 3 నుంచి 4 లక్షల ఎకరాలకు పెంచారని, ఆయకట్టు పెంచినప్పటికీ నీటి కేటాయింపులు పెంచలేదని ఈఎన్సీ లేఖలో స్పష్టం చేశారు.
శ్రీశైలం ఎడమ గట్టు కాలువ రెండు కాంపోనెంట్లుగా 15 జులై 2021 గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్ 1, 2 లలో అని తప్పుగా చూపించారు. నిజానికి అవి రెండూ ఒకే కాంపోనెంటుకు చెందినవి. రెండవ కాంపోనెంటులో 10 టీఎంసీలు అదనంగా వాడుతున్నట్లుగా ఉంది. అది సరి కాదు. నాటి ఆంధ్రప్రదేశ్, SLBC ప్రాజెక్టులోని ఆయకట్టును 3 లక్షల ఎకరాల నుండి 4 లక్షల ఎకరాలకు పెంచారు కానీ దానికి సరిపోయే నీటి కేటాయింపు చేయలేదు.
అందువల్ల, తెలంగాణ రాష్ట్రం పెరిగిన ఆయకట్టుకు తగినంతగా 30 టీఎంసీల నుండి 40 టీఎంసిలుగా నీటి కేటాయింపు చేసింది. అంతే తప్ప కొత్త కాంపోనెంటు కాదు అని తెలంగాణ KRMBకి రాసిన లేఖలో స్పష్టం చేసింది. రెండవ కాంపోనెంటు నెంబర్ 1.12 ను గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్ -1, 2 ల నుండి తొలగించాలి అని కోరింది.