టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్
హుజూరాబాద్ చౌరస్తా/హుజూరాబాద్ రూరల్: ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించే బీజేపీకా.. మన జీవితాలకు అండగా నిలిచిన కేసీఆర్కా.. ఆలోచించి ఓటేయాలని కార్మికులకు టీఆర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ పిలుపునిచ్చారు. హుజూరాబాద్ పట్టణంలోని సిటీ సెంటర్ హాల్లో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అసంఘటిత, సంఘటిత కార్మికులు ఐక్యంగా ఉండి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించుకోవాలన్నారు. గత పాలకులు కార్మికులను పట్టించుకున్న పాపానపోలేదని విమర్శించారు.
దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు కార్మికుల కోసం ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా రూ.2లక్షల నుంచి రూ.6లక్షలకు పెంచడం జరిగిందని, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వడం హర్షణీయమన్నారు. ఆశ, వీఆర్ఏలకు వేతనాలు పెంచిన ఘనత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కార్మిక రంగానికి అన్యాయం చేస్తూ నిర్ణయాలు తీసుకొనే బీజేపీకి ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శివశంకర్, నాయకులు నర్సింహులు, తిరుపతి, శ్రీనివాసచారి తదితరులున్నారు.