హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన రైతులందరికీ యాసంగి పంట పెట్టుబడి, వ్యవసాయ అవసరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు నిధులను ఇప్పటికే విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా నాలుగో రోజు రైతుబంధు నిధులు రూ.1144 కోట్లను జమ చేశామని మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు.
ఇవాళ 6,75,824 మంది రైతుల ఖాతాల్లో నగదు జమ అయింది. ఇప్పటి వరకు 52,71,091 మంది రైతులకు రైతుబంధు నిధులు అందాయి. మొత్తం రూ.4246 కోట్లను రైతుబంధు నిధుల కోసం పంపిణీ చేస్తున్నాం. సీఎం సూచనలతో మార్కెట్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ ఏర్పాటు చేశాం. డిమాండ్ ఉన్న పంటల సాగుకు రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ సలహాలు ఇస్తుంది. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లను పరిశీలించి.. సీజన్కు ముందు సాగు చేయాల్సిన పంటల వివరాలను రైతులకు అందిస్తాం. ఇతర పంటల్లో భాగంగా పప్పు, నూనెగింజల సాగు మరింత పెరగాలి అని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.