ఇటీవల తీన్మార్ మల్లన్న.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై చేసిన బాడీషేమింగ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ), టీయూడబ్ల్యూజే ఖండించింది.
మీడియా స్వేచ్ఛ దుర్వినియోగం ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీస్తుందని ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నగునూరి శేఖర్, విరాహత్ అలీ హెచ్చరించారు.
ప్రజా ప్రయోజనాల వార్తల వెల్లడికి ఎలాంటి సాహసాలకైనా పూనుకోవచ్చని, అయితే
ఆ ముసుగులో జర్నలిజాన్ని దుర్వినియోగం చేయడం వృత్తి ధర్మాన్ని అపహాస్యం చేస్తుందని ఐజేయూ, టీయూడబ్ల్యూజే నాయకులు స్పష్టం చేశారు. హిమాన్షుపై ఓ యూట్యూబ్ ఛానెల్ లో తీన్మార్ మల్లన్న వాడిన భాషా, వ్యాఖ్యలు ఏమాత్రం సమర్థనీయం కాదని వారు ఖండించారు. ఓ రాజకీయ పార్టీ విశ్వాసాలను పవిత్రమైన జర్నలిజానికి జతకట్టడం సహించరాని అనైతికమని వారు పేర్కొన్నారు.