న్యూఢిల్లీ: కలలను నెరవేర్చుకోవడానికి వయస్సు అడ్డంకి కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య దీనికి ఉదాహరణ అని కొనియాడారు. ఆదివారం నిర్వహించిన ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్’లో ఈ విషయాన్ని మోదీ ప్రస్తావించారు. 84 ఏండ్ల డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య వయసు పైబడినప్పటికీ తన కలను నేరవేర్చుకున్నారని తెలిపారు. పెద్ద లైబ్రరీని తెరువాలని చిన్ననాటి నుంచి ఆయన కోరుకునేవారని అన్నారు. లెక్చరర్గా కొంత కాలం పని చేసిన ఆయన చాలా పుస్తకాలను సేకరించారని రిటైర్మెంట్ తర్వాత వాటితో లైబ్రరీని ప్రారంభించారంటూ ప్రశంసించారు. పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చని, వయసుతో సంబంధం లేదని ఆయన నిరూపించారని మోదీ కొనియాడారు.
కాగా, యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నీర్నేమల గ్రామంలో 1938 జూలై 9న జన్మించిన విఠలాచార్యకు చిన్న తనం నుంచి పుస్తక పఠనంపై చాలా ఆసక్తి ఉండేది. చదువుకునే వయసు నుంచి ఆయనకు పెద్ద లైబ్రరీ పెట్టాలన్నది ఒక కల. ఇందుకోసం ఆయన చదువుకునే సమయం నుంచే పుస్తకాల సేకరణ మొదలుపెట్టారు. లైక్చరర్, ప్రిన్సిపాల్గా పని చేసి రిటైర్ అయిన ఆయన తాను నివాసం ఉంటున్న ఎల్లంకి గ్రామంలో 2014లో 4 వేల పుస్తకాలతో లైబ్రరీని స్టార్ట్ చేశారు. అయితే కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి లైబ్రరీ మొదలుపెట్టినప్పటికీ దానిని నడపలేకపోయారు.
అయినా విఠలాచార్య నిరుత్సాహ పడకుండా సొంతంగా పుస్తకాలు సేకరిస్తూ వచ్చారు. చివరకు రిటైర్మెంట్ తర్వాత తన కలను నిజం చేసుకున్నారు. ‘ఆచార్య కూరెళ్ల గ్రంథాలయం’ పేరుతో ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న గ్రంథాలయంలో 2 లక్షలకు పైగా పుస్తకాలు ఉన్నాయి. ఆయన ఇంటిని లైబ్రరీగా మార్చడంలో పూర్వ విద్యార్థులు కూడా సహకరించారు. విఠలాచార్య దాదాపు 20 పుస్తకాలు కూడా రాశారు.