మేడ్చల్, కుత్బుల్లాపూర్, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి సొంత పార్టీలో మరోసారి చుక్కెదురైంది. కాంగ్రెస్లో అంతర్గత కుమ్ములాటలు ఆ పార్టీ నిర్వహిస్తున్న శిక్షణా తరగతుల వేదికపై రచ్చకెక్కాయి. మేడ్చల్ జిల్లా కొంపల్లిలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మొదటిరోజే రేవంత్ ప్రసంగానికి కాంగ్రెస్ శ్రేణులు అడ్డుతగిలారు. జనగామ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, సీనియర్ నాయకుడు జంగ రాఘవరెడ్డి అనుచరులు ముందుగా తమ మధ్య పంచాయతీని తేల్చాలంటూ రేవంత్ను అడ్డుకున్నారు. దీంతో అసహనానికి గురైన రేవంత్ పార్టీలో క్రమశిక్షణ లేకుండా పోతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్ ఎంత బతిమాలినా వినకుండా నినాదాలుచేసిన కార్యకర్తలు సభను స్తంభింపజేశారు. ఇదిలా ఉండగా, శిక్షణా తరగతులు నిర్వహిస్తున్న ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫ్లెక్సీలను తొలగించడంతో ఆయన మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న మేడ్చల్ జిల్లాలోనే పార్టీ ఒక్కతాటిపై లేదని, ఇక రాష్ట్రమంతటా నాయకులు, కార్యకర్తలు ఎలా కలిసి పనిచేస్తారని పరిశీలకులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.