వనపర్తి : ప్రజాసేవను తపస్సులా స్వీకరించాం. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై ప్రతిపక్షాలవి కేవలం అపోహలు. అపోహలను పటాపంచలు చేస్తూ అభివృద్ధిని సాధించామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(Minister Niranjan Reddy) అన్నారు. వనపర్తి తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు భరోసా కల్పిస్తూ పాలన సాగించాం. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో కూడా తెలంగాణ తలసరి ఆదాయం లేదన్నారు.
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టు పనులన్నీ 30, 40 ఏళ్లు దాటినవేనని, బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కేవలం మూడున్నర ఏండ్లలో పూర్తి చేసి సాగు నీరు అందజేశామని పేర్కొన్నారు. అత్యంత వేగంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిని సాధించింది. రాష్ట్రంలో ప్రజలకు ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అభివృద్ధిలో దాపరికం లేదు. వ్యవసాయం కోసం నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పాలనా అంతా అంతా మోసపూరితమేనని మండిపడ్డారు. దేంలోని సమస్యలన్నింటికి ఆ పార్టీనే కారణమని ఆరోపించారు. ఆ పార్టీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తూ ప్రజలను మోసం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.