సూర్యాపేట : రైతుబంధు(Rythu bandhu)ను ఆపాలని ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీ దుర్మార్గానికి పరాకాష్ట అని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి(Minister Jagdish Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సూర్యాపేటలో మీడియాతో మాట్లాడిన మంత్రి.. కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ రద్దుల పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ చర్యల పై ప్రజలు ఉద్యమించాలన్నారు.
కాంగ్రెస్ తీరు ఉచిత విద్యుత్, మిషన్ భగీరథను కూడా ఆపేలా ఉందన్నారు. కేసీఆర్ పథకాలు ఆపాలని కుట్ర చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మోడల్ పథకాలు ఇతర రాష్ట్రాల ప్రజలు అడుగుతున్నారనే భయం పట్టుకుందన్నారు. కర్ణాటకలో ఏకంగా కరెంట్ కోసం సబ్ స్టేషన్లలో మొసళ్లు వదిలే దుస్థితి వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ పద్దుల పార్టీ కాదు రద్దుల పార్టీ అని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలను తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీని ఎదగనీయకుండా చేయాలని కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రజల కోసం పనిచేసే పార్టీని ప్రజలు గుర్తించాలి. బీజేపీ పాలనలో పెనం నుంచి పొయ్యిలో పడ్డ చందంగా దేశ ప్రజల పరిస్థితి మారిందన్నారు. ఈసీకి ఫిర్యాదుతో రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ కపట ప్రేమ బట్టబయలైందన్నారు. గ్రామాల్లో ఆ పార్టీ అభ్యర్థులను నిలదీయాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.