ఏండ్లకేండ్లూ కష్టపడితే తప్ప కొత్త సిటీకి సంబంధించిన బ్లూప్రింట్ సిద్ధంకాదు. కానీ కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి న్యూ సిటీ బ్లూప్రింట్ను సిద్ధంచేయడం నెలరోజుల పని. అది కూడా.. ఫాక్స్కాన్ను బెంగళూరుకు తరలించాలంటూ ఆ కంపెనీ సీఈవోకు డీకే శివకుమార్ లేఖ రాసిన సమయంలోనే కొత్త సిటీకి సంబంధించిన ఈ బ్లూప్రింట్ను ప్రభుత్వం హడావుడిగా సిద్ధం చేసింది.
ఇది చాలదా..! హైదరాబాద్ కంపెనీలను బెంగళూరుకు తరలించడానికి కర్ణాటక కాంగ్రెస్ ఏ స్థాయిలో కుట్రలకు తెగబడుతున్నదో అర్థంచేసుకోవడానికి!! దీన్ని చూస్తే అర్థమైపోవడం లేదా? పచ్చని రాష్ట్రంపై హస్తం విషపు పంజా విసరబోతున్నదని!!!
Karnataka Congress | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకొని, ఇక్కడి కంపెనీలను బెంగళూరుకు తరలించుకుపోయేందుకు కర్ణాటక కాంగ్రెస్ కుట్రలకు తెరతీస్తున్నదా? గడిచిన కొద్దిరోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నాయి. తెలంగాణలోని కంపెనీలను బెంగళూరుకు రావాల్సిందిగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆయా కంపెనీల ప్రతినిధులకు లేఖలు రాసినట్టు ఇటీవల జాతీయ మీడియాలో, కర్ణాటక పత్రికల్లో పలు కథనాలు వెలువడ్డాయి. హైదరాబాద్లోని ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు రప్పించేందుకు ఆ కంపెనీ సీఈవోకు డీకే స్వయంగా లేఖ రాశారన్న ఆరోపణలు సంచలనమయ్యాయి. బెంగళూరు శివారులో 2వేల ఎకరాల్లో నాలెడ్జ్ సిటీని నిర్మించి, కంపెనీలను రప్పించనున్నట్టు సిద్ధరామయ్య సర్కారు ప్రకటించింది. బ్లూప్రింట్ కూడా సిద్ధమైనట్టు వెల్లడించింది.
హడావుడి అందుకేనా?
గుజరాత్లో గిఫ్ట్ సిటీ పేరిట కొత్త నగరాన్ని ఏర్పాటుచేస్తున్నారు. గిఫ్ట్ సిటీ ఆలోచన పురుడుపోసుకొన్న ఎనిమిదేండ్ల తర్వాతే సిటీని నిర్మిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మధ్యకాలంలో ప్రణాళిక, ప్రతిపాదనలు, చర్చలు, సాధ్యాసాధ్యాలను బేరీజు వేసుకొన్నాకే.. బ్లూప్రింట్ను విడుదల చేశారు. బెంగళూరులో ఏర్పాటు చేయాలనుకొంటున్న నాలెడ్జ్ సిటీ విషయంలో ఐదారు వారాల వ్యవధిలోనే హడావుడిగా ప్రకటన విడుదల చేశారు. బ్లూప్రింట్ను నెల వ్యవధిలోనే తయారుచేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలెడ్జ్ సిటీ ఏర్పాటుపై తొలిసారిగా లీకులు వచ్చిన సమయంలోనే.. అంటే గత సెప్టెంబర్లోనే తెలంగాణలోని ఫాక్స్కాన్కు డీకే లేఖ రాసినట్టు సోషల్మీడియాలో ప్రచారమైన లెటర్ను బట్టి అర్థమవుతున్నది. తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి మొత్తం ఫండింగ్ కర్ణాటక నుంచే వెళ్లిందని, దానికి ప్రతిగా ఇక్కడి కంపెనీలను కర్ణాటకకు తరలించడానికి డీల్ కుదిరిందని సోషల్మీడియాలో ఇటీవల తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఇప్పుడు నాలెడ్జ్ సిటీపై హడావుడి ప్రకటన చూశాక.. డీల్ వార్తలు నిజమేనన్న వాదనలు బలపడుతున్నాయి.
ఏమిటీ నాలెడ్జ్ సిటీ?
దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ కంపెనీలు, పరిశ్రమలు, పరిశోధన కేంద్రాలు, దవాఖానలు, వర్సిటీలను రప్పించడానికి బెంగళూరుకు 60 కిలోమీటర్ల దూరంలో 2 వేల కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలెడ్జ్, హెల్త్కేర్, ఇన్నోవేషన్, రీసెర్చ్ సిటీ (కేహెచ్ఐఆర్ సిటీ-నాలెడ్జ్ సిటీ) పేరిట కర్ణాటక సర్కారు ఈ సిటీని నిర్మించేందుకు సమాయత్తమైంది. రూ. 40 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సిటీని నిర్మిస్తున్నట్టు చెప్పుకొచ్చింది. ఒకవేళ సిటీ నిర్మాణం పూర్తయ్యి కంపెనీలు కొలువుదీరితే 80 వేల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వపెద్దలు చెప్తున్నారు. ఐటీ, మెడికల్ టూరిజంలో బెంగళూరును అగ్రగామిగా కొనసాగించడానికే నాలెడ్జ్ సిటీని తీసుకొస్తున్నట్టు పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ తెలిపారు. సిటీ నిర్మాణం పూర్తైతే, రాష్ట్ర జీడీపీకి రూ. లక్ష కోట్లు అదనంగా సమకూరుతాయని పేర్కొన్నారు.