హైదరాబాద్ : జనగామ జిల్లాపాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా రాయపర్తి మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నేతలు ఐత రాజు ఆధ్వర్యంలో జంపి, రాకేష్, రాము, ప్రశాంత్, రాఘవ్, మహేష్, రాజు, సందీప్, చందు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) పార్టీలోకి ఆహ్వానించారు.
అలాగే, మహబూబాబాద్ జిల్లా, నెల్లికుదురు మండలం, వావిలాల గ్రామ బీజేపీ అధ్యక్షుడు గుండెపాక శ్రీకాంత్ నేతృత్వంలో గ్రామ కమిటీ సభ్యులు ప్రమోద్, ప్రవీణ్, అశోక్, కుమార్ తదితరులు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరగా.. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకు ముందు మంత్రులు ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్ సీఎం కేసీఆర్ సభా ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, ఈ నెల 27న సీఎం కేసీఆర్ మహబూబాబాద్, వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు.