Sanjay Kumar | మసకబారిన కండ్లకు చికిత్స చేస్తూ ఎందరి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు డాక్టర్ మాకునూరు సంజయ్ కుమార్. జగిత్యాల నియోజకవర్గంలో వాడవాడలా ఉచిత నేత్ర వైద్య శిబిరాలను నిర్వహిస్తూ.. వెలుగుల రేడుగా వెలుగొందుతున్నారు. జగిత్యాలకు ‘చూపు’ను ప్రసాదించిన నేతగా జనం గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు.
ఎమ్మెల్యేగా ఉంటూ ఏటా వెయ్యి కంటి ఆపరేషన్లు చేస్తున్నారు. మూడు దశాబ్దాల తన వైద్య జీవితంలో 40వేలకుపైగా కంటి శస్త్రచికిత్సలు చేశారు. అందులో 10వేల మందికి ఉచిత కంటి ఆపరేషన్లు చేశారు. జగిత్యాలలో ప్రాథమిక, మాధ్యమిక విద్య, విజయవాడలో ఎంబీబీఎస్ చదివారు. నేత్ర వైద్యంలో పీజీ చేశారు. తర్వాత ఆంధ్రాలోని ఉయ్యూరు చారిటీ దవాఖానలో కంటి వైద్యుడిగా జీవితాన్ని ప్రారంభించారు.
సొంతగడ్డకు సేవచేయాలని..
1992లో మెట్పల్లి పట్టణంలో కంటి వైద్యశాలను ప్రారంభించారు. ఉయ్యూరు చారిటీ ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించేది. ఆ స్ఫూర్తితో మెట్పల్లిలో తొలి ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ప్రతివారం ఉచిత కంటి పరీక్షలు నిర్వహించేవారు. 1999లో జగిత్యాలలో పావని కంటి దవాఖానను ప్రారంభించారు. 2000 సంవత్సరం నుంచి జగిత్యాల, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎన్నో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు.
ఆపరేషన్కు ఎవరూ ముందుకురాలే..
రాయికల్ మండలంలోని అటవీ గ్రామమైన జగన్నాథ్పూర్ గ్రామంలో నిర్వహించిన వైద్యశిబిరం ప్రత్యేకమైనదిగా డాక్టర్ సంజయ్ గుర్తుచేస్తారు. ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆపరేషన్లు అవసరమైన వారిని గుర్తించాం. వారికి మరుసటిరోజు ఆపరేషన్లు చేస్తామని చెప్పాం. అయితే ఒక్కరూ ముందుకు రాలేదు. ఎందుకంటే అప్పటి వరకు ఆ గ్రామంలో ఎవరికీ ఆపరేషన్ జరగలేదట.. అందుకే అందరూ భయపడ్డారు. పోలీసులు, ప్రజాప్రతినిధుల సహకారంతో నచ్చచెప్పి, ఆపరేషన్లు చేశాం.
కేసీఆర్ స్ఫూర్తిగా రాజకీయాల్లోకి..
డాక్టర్ సంజయ్ కేసీఆర్ను స్ఫూర్తిగా తీసుకుని బీఆర్ఎస్లోకి వచ్చారు. 2014లో జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేసి, స్వల్పతేడాతో ఓడిపోయినా.. ప్రజలతో మమేకమై పనిచేశారు. 2018లో జగిత్యాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచి, ప్రజాక్షేత్రంలో ఎంత బిజీగా ఉన్నా కంటి ఆపరేషన్లు కొనసాగిస్తూనే ఉన్నారు. 2021 మొదట్లో వంద రోజుల్లో వెయ్యి శస్త్ర చికిత్సలు చేయాలని సంకల్పించారు. కొవిడ్ తీవ్ర రూపం దాల్చడంతో ఉచిత శస్త్ర చికిత్సలు తగ్గించాల్సివచ్చింది. తిరిగి శస్త్ర చికిత్సలు ప్రారంభించి డిసెంబర్ చివరి నాటికి 911 శస్త్ర చికిత్సలు పూర్తి చేశారు. ఆ తర్వాత 2022లో 950 శస్త్ర చికిత్సలు చేశారు. ఇలా తన మూడు దశాబ్దాల వైద్య ప్రయాణంలో 40వేలకు పైగా శస్త్ర చికిత్సలు చేస్తే, అందులో పదివేలు ఉచిత శస్త్ర చికిత్సలే కావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చాయని డాక్టర్ సంజయ్ పొంగిపోతారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘కంటివెలుగు’, వైద్య సంస్కరణలు దేశానికే తలమానికంగా నిలిచాయని డాక్టర్ సంజయ్ సంబురపడతారు.