Marri Janardhan Reddy |మనిషి పుట్టుక, చావు చేతుల్లో లేదు. పుట్టినంక మనకంటూ ఓ చరిత్ర ఉండాలన్నది ఆయన లక్ష్యం. పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే తనలా పేదరికంతో ఎవరూ బాధపడకూడదని భావించారు. తల్లిదండ్రులకు భారం కావద్దని పట్నం వెళ్లి పనిలో చేరారు. కష్టాన్ని, క్రమశిక్షణను నమ్ముకున్నారు. ఒకప్పుడు బట్టల షాపులో పనిచేసిన ఆయన ఇప్పుడు ఎన్నో షాపులకు ఓనరయ్యారు. ఒక్కో మెట్టు ఎక్కుతూ వ్యాపార దిగ్గజంగా ఎదిగారు. నిరుపేదల జీవితాల్లో సంతోషాలు నింపాలనే లక్ష్యంతో ఎంజేఆర్ ట్రస్టు నెలకొల్పారు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతూ వారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు మర్రి జనార్దన్రెడ్డి.
నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు మర్రి అమృతమ్మ-జంగిరెడ్డిల పెద్దకొడుకు జనార్దన్రెడ్డి. ఒక్క ఎకరం భూమి మాత్రమే కలిగిన నిరుపేద కుటుంబం. పదో తరగతి వరకు చదివిన ఆయన పొట్టకూటి కోసం పట్నం వలస వెళ్లారు. ఓ బట్టల దుకాణంలో పనికి కుదిరారు. రేయింబవళ్లు కష్టపడి పనిచేశారు. తాను పనిచేసిన జేసీ కార్నర్ దుకాణంతోనే ఆయనకు అదృష్టం కలిసి వచ్చింది. జేసీ బ్రదర్స్, చెన్నై షాపింగ్ మాల్స్ అధినేతగా ఎదిగారు. తెలుగు రాష్ర్టాల్లో వ్యాపారాన్ని విస్తరించారు. ప్రముఖ వ్యాపారవేత్తగా ఎదిగిన మర్రి జనార్దన్రెడ్డి, పేదలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఎంజేఆర్ ట్రస్టును నెలకొల్పారు. ట్రస్టు ద్వారా కోట్లాది రూపాయలు ఖర్చు చేసి వేలాది నిరుదపేద జంటలకు పెండ్ల్లిండ్లు చేశారు. నిరుద్యోగ యువతకు పోలీసు, ఉపాధ్యాయ, గ్రూప్స్ శిక్షణ, ఉచితంగా వసతి, భోజనం, స్టడీ మెటీరియల్ అందించారు. తిమ్మాజిపేటలో కార్పొరేట్ స్థాయి ప్రభుత్వ జెడ్పీ పాఠశాల భవనాన్ని నిర్మించారు. తాడూరు, సిర్సవాడలో పాఠశాల భవనాలను ఆధునీకరించారు. మర్రన్న క్యాంటిన్ను ఏర్పాటు చేసి ప్రతిరోజూ రూ.5కే భోజనం అందజేస్తున్నారు. 20 వేల మందికి డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించిన ఆయన బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు సార్లు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజేతగా నిలిచారు.
ప్రగతికి బాటలు..
రెండుసార్లు ఎమ్మెలేగా గెలుపొందిన మర్రి జనార్దన్రెడ్డి నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంగా ఏర్పాటయ్యింది. అత్యంత సుందరంగా మినీ ట్యాంక్బండ్ను నిర్మింపజేశారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఎంజీకేఎల్ఐ ప్రాజెక్టును పూర్తి చేయించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో 1.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే పనులు పూర్తయ్యాయి. మార్కండేయ రిజర్వాయర్ పనులు పురోగతిలో ఉన్నాయి. జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ భవనం, ప్రజావసరాలకు అనుగుణంగా పట్టణంలోని అనేక రోడ్లను విస్తరించారు. భూగర్భ డ్రైనేజీని ఏర్పాటు చేశారు. ఎల్ఈడీ బల్బులతో విద్యుద్దీకరించారు. భారీగా మొక్కలు నాటి హరిత పట్టణంగా తీర్చిదిద్దారు. అనేక గ్రామాలకు మౌలిక వసతులు కల్పించారు. గడపగడపకూ సంక్షేమ ఫలాలు అందజేస్తున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను కండ్లారా చూస్తున్న ప్రజలు జనార్దన్రెడ్డి ఎక్కడికి వెళ్లినా జై కొడుతున్నారు.