అలంపూర్: ప్రజాస్వామ్యంలో కావాల్సింది ఫ్యాక్షనిస్టులు, దాదాగిరి, గుండాగిరి కాదని, ఒకరినొకరు చంపుకునే సంస్కృతి కాదని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అలంపూర్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. జోగుళాంబ అమ్మవారి దేవస్థానం అద్భుతమైన శక్తి పీఠాలలో ఐదో స్థానంలో ఉన్నదని, అక్కడి నుంచే అమ్మవారికి దండం పెట్టి.. అలంపూర్ ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద 2002లో అలంపూర్ నుంచి గద్వాల దాకా పాదయాత్ర చేశానని చెప్పారు. ప్రజలకున్న ఆయుధం ఓటు కాబట్టి దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే మంచి జరిగే అవకాశం ఉంటదని సూచించారు.
‘సమైక్య రాష్ట్రంలో తెలంగాణలో జరిగిన దోపిడీ మీకు తెలుసు. రైతాంగం ఏవిధంగా నష్టపోయిందో, పాత మహబూబ్నగర్ జిల్లా ఎటువంటి దురవస్థలకు గురైందో మీరందరూ చూశారు. కృష్ణా, తుంగభద్ర నదుల మధ్య ఉన్న స్థలాన్ని నడిగడ్డ అని పిలుస్తం. ఉద్యమ సందర్భంలో నేను నడిగడ్డ ప్రాంతానికి వచ్చిన. ఇక్కడ సభ పెట్టి ప్రజల దుస్థితి చూసినం. మేం కూడా కళ్లకు నీళ్లు తీసుకున్నం. ఇంత అన్యాయం ఎవరి మీద జరిగినా ఊరుకోరు అని చాలా బాధపడ్డం. ఇక్కడి బాధలు చాలా భయంకరం. ముంబైకి వలసలు. యావత్ భారతదేశం ఎక్కడ చూసినా వలసొచ్చిన పాలమూరు బిడ్డలే. చాలా ఘోరమైన పరిస్థితులు మనం చూసినం’ అని సీఎం గుర్తుచేశారు.
‘మీ అందరినీ నేను కోరేది ఏందంటే.. తొమ్మిదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండే ఇప్పుడెట్లుందో గమనించాలె. పరిస్థితులల్ల ఎంత మార్పు వచ్చిందో చూడాలె. తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఈ ప్రాంతాన్ని ఆంధ్రాలో కలుపడంవల్ల 58 ఏళ్లు మనం గోసపడ్డం. ఎవ్వరూ మన బాధను తీర్చలే. ఇక్కడున్న కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులకు పట్టించుకోకుండా పెండింగ్ ప్రాజెక్టులు అని పేరు పెట్టిండ్రు. చేతులు ముడుచుకున్నరు గానీ ఎవ్వడేం చేయలే’ అని సీఎం విమర్శించారు.