సూర్యాపేట టౌన్, డిసెంబర్ 25 : ‘శాంతియుత సమాజం కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలి. ప్రపంచ శాంతిని కోరిన దయామయుడు ఏసుక్రీస్తు. ఆయన జన్మదినాన్ని క్రిస్మస్ పండుగగా జరుపుకోవడం, సాటి మనిషి శ్రేయస్సు కోసం కృషి చేయడమే అసలైన క్రైస్తవం. ఆ మార్గాన్ని క్రైస్తవులంతా ఆచరించాలి.’ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అందరి ఆకాంక్షలకు అనుగుణంగా నేడు సర్వమతాలకు సమ ప్రాధాన్యతనిస్తూ అన్ని రంగాల అభివృద్ధితో సంచలనాత్మకమైన పాలన అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు చర్చిల్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొని కేక్లు కట్ చేసి అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ శాంతి సహనాలే అభివృద్ధికి సోపానాలని, ప్రతి ఒక్కరిలో ఓర్పు, సహనం పెరిగి ఐక్యతగా జీవించాలని అన్నారు.
ప్రతి ఇంటా సౌభాగ్యాలు నిండాలని, ప్రార్థనలతో అన్ని రంగాలు మరింత అభివృద్ధి చెంది శాంతియుత సమాజంగా మారాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అన్ని మతాలు మానవత్వంగా జీవించడమే నేర్పిస్తున్నాయని, వాటిని సక్రమంగా ఆచరణలో పెట్టడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనకు తానే సాటి అన్నారు. నిరంతరం కులమతాల చిచ్చుతో భయానక వాతావరణంలో సాగిన ఉమ్మడి పాలనను పారదోలిన సీఎం కేసీఆర్ నాయకత్వంలో స్వరాష్ట్రంలో సర్వమతాలకు సమన్యాయం జరుగుతుందని తెలిపారు. అన్ని మతాల ప్రధాన పండుగలను ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించి అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఏటా రంజాన్కు ముస్లిం కుటుంబాలకు దుస్తులు, పండుగ సామగ్రితో పాటు ఇఫ్తార్.. క్రిస్మస్కు క్రైస్తవులకు చీరెలు, దుస్తులతో కూడిన గిఫ్ట్ ప్యాక్లు, ప్రేమ విందులు ఇస్తున్నదని గుర్తు చేశారు. దసరా కానుకగా బతుకమ్మ చీరెలను హిందువులతోపాటు అన్ని మతాల వారికి అందిస్తున్నట్లు తెలిపారు. సూర్యాపేట జిల్లాలో దేవాలయాలు, మసీదులతో పాటు అనేక చర్చిల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు.
రాబోయే రోజుల్లోనూ అన్ని రంగాలను మరింత అభివృద్ధి పథంలో నడుపుకొంటూ శాంతి సహనాలను పెంపొందించుకుంటూ ఐక్యతతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలోని విజయ కాలనీలో సిల్వీ సిలోయం చర్చి, రాజీవ్నగర్లోని గ్రేస్ చర్చి, శ్రీరామ్నగర్లోని మన్నా చర్చి, చర్చి కాంపౌండ్లోని సెయింట్ బాప్టిస్టు చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం అర్ధరాత్రి పలు చర్చిల్లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో మంత్రి జగదీశ్రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, ఎంపీపీ నెమ్మాది భిక్షం, జడ్పీటీసీ జీడి భిక్షం, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గండూరి ప్రవళికా ప్రకాశ్, మైనార్టీ కో ఆప్షన్ సభ్యురాలు స్వరూపారాణి, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై.వెంకటేశ్వర్లు, నాయకులు ఉప్పల ఆనంద్, సవరాల సత్యనారాయణ, గండూరి ప్రకాశ్, గుండపునేని కిరణ్, రఫీ, కౌన్సిలర్లు, పాస్టర్లు పాల్గొన్నారు.