సూర్యాపేట టౌన్, ఏప్రిల్ 28 : కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల సరఫరాలో సమస్య ఉండొద్దని వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్రావును విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఆదేశించారు. టెస్టుకిట్లను పెంచి పంపాలని ఆయన సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో బుధవారం మధ్యాహ్నం మంత్రి కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. అనంతరం అదే దవాఖానలో కొవిడ్ బారిన పడి చికిత్స పొందుతున్న వారితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. పాజిటివ్ అని తేలగానే పరేషాన్ కావద్దని సూచించారు. భయాందోళనే మనిషిని ఆగం చేస్తుందన్న విషయాన్ని గుర్తించాలని చెప్పారు. మానసిక ధైర్యమే కరోనాకు మందులాగా పని చేస్తుందన్నారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా పేషెంట్ల బంధువులతో జనరల్ ఆస్పత్రి బయట మాట్లాడిన మంత్రి జగదీశ్రెడ్డి వారికి భరోసా ఇచ్చారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారికి సరిపడా బెడ్లు ఖాళీగా ఉన్నాయని, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సకాలంలో వైద్య సేవలందిస్తున్నదన్నారు. వ్యాక్సినేషన్పై అపోహలు వీడి అంతా టీకాలు వేయించుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ముందుగా 65ఏండ్లు దాటిన వారికి, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి అందించిన టీకా ప్రస్తుతం 45ఏండ్లు దాటిన వారికి అందిస్తున్నట్లు తెలిపారు. మే 1నుంచి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ టీకా వేయనున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు ముందస్తు చర్యలతో కరోనా కట్టడికి విస్తృత చర్యలు చేపడుతూ సంబంధిత శాఖలతోపాటు ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేస్తున్నారన్నారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించి భౌతికదూరం పాటించాలన్నారు. అనంతరం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలతోపాటు నూతనంగా నిర్మిస్తున్న భవనాన్ని సందర్శించారు. మంత్రితోపాటు జనరల్ దవాఖాన సూపరింటెండెంట్ దండ మురళీధర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వట్టె జానయ్యయాదవ్, రామగిరి నగేశ్ తదితరులు ఉన్నారు.