మఠంపల్లి, జూన్ 23 : పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం లభిస్తుందని రాష్ట్ర విజిలెన్స్ అధికారి చక్రవర్తి అన్నారు. బుధవారం మండలంలోని బక్కమంతులగూడెం, చెన్నాయిపాలెంలోని అంగన్వాడీ కేంద్రాలు, పల్లెప్రకృతి వనాలు, నర్సరీలు, పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్థను సక్రమంగా నిర్వహించాలన్నారు. రోడ్లపై చెత్త వేస్తే జరిమానా విధించాలని సూచించారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండి ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ఆయన వెంట టీఏలు బుంగయ్య, సక్రూనాయక్, కార్యదర్శులు ఉన్నారు.
పల్లెలను హరిత వనాలుగా తీర్చిదిద్దాలి
గరిడేపల్లి : పల్లెలను హరితవనాలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఎంపీపీ పెండెం సుజాతాశ్రీనివాస్గౌడ్, జడ్పీటీసీ పోరెడ్డి శైలజారవీందర్రెడ్డి అన్నారు. మండలంలోని అబ్బిరెడ్డిగూడెం, లక్ష్మీపురం, సర్వారం గ్రామాల్లోని పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలను బుధవారం వారు పరిశీలించారు. ఇన్చార్జి ఎంపీడీఓ వనజ, ఎంపీఓ లావణ్య, ఎంపీటీసీ ఇసాక్, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలి
మేళ్లచెర్వు : మండల వ్యాప్తంగా పల్లె ప్రగతి పనులను త్వరగా పూర్తి చేయాలని మండల ప్రత్యేకాధికారి శ్రీధర్ సూచించారు. మండలంలోని వెల్లటూరులో వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, నర్సరీ, సెగ్రిగేషన్ షెడ్డు, డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. ఆయన వెంట ఎంపీడీఓ ఇసాక్హుస్సేన్, ఎంపీఓ వీరయ్య, ఏపీఓ రాజు, సర్పంచ్ గురువయ్య, ఉపాధి హామీ సిబ్బంది ఉన్నారు.
చిలుకూరు : మండలంలోని బేతవోలు, చిలుకూరు గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను ఎంపీడీఓ ఈదయ్య పరిశీలించారు. కార్యక్రమంలో బేతవోలు సర్పంచ్ వట్టికూటి చంద్రకళానాగయ్య, ఏఓ శ్రీనివాస్, ఎంపీఓ నరసింహారావు, గ్రామ కార్యదర్శి సురేశ్, ఏఈఓ నాగస్వాతి తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ రూరల్ : మండలంలోని వేపలసింగారంలో అభివృద్ధి పనులను ఎంపీపీ గూడెపు శ్రీనివాస్ పరిశీలించారు. సర్పంచ్ అన్నెం శిరీషా కొండారెడ్డి, ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి, ఏపీఓ శైలజ, కార్యదర్శి నాగమణి, నాయకులు భాస్కర్రెడ్డి, సైదిరెడ్డి పాల్గొన్నారు. అలాగే మండల పరిషత్ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ సిబ్బంది, మల్టీపర్పస్ వర్కర్లను సన్మానించారు. ఎంపీఓ మౌలానా, సిబ్బంది ఉన్నారు.