నిడమనూరు,జూన్23: వ్యవసాయంలో విజ్ఞా నాన్ని పెంపొందించేందుకు రైతు వేదికలు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఇండ్లకోటయ్య గూడెం, ముప్పారం, నిడమనూరు గ్రామాల్లో రైతువేదికలను ఎమ్మెల్యే నోముల భగత్తో కలిసి బుధవారం మంత్రి ప్రారంభించారు. ముప్పారం రైతు వేదిక భవనంలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. రైతులు తమ సాగు అనుభవాలను తోటి వారితో పంచుకునేందుకు రైతువేదికలు ఉపయోగపడతాయన్నారు. వ్యవసాయ విజ్ఞానాన్ని పంచుకునేందుకు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు వేదికలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు సాగుపై ఆసక్తి చూపేవారు కాదని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ నేతృత్వంలో రైతు సంక్షేమానికి చేపడుతున్న కార్యక్రమాలతో రైతాంగం క్షణం తీరిక లేకుండా సాగుపనుల్లో నిమగ్నమవుతున్నారని పేర్కొన్నారు.
నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉన్న లోలెవల్ కాల్వను పూర్తి చేసి 80 వేల ఎకరాలకు సాగు నీరందించిన టీఆర్ఎస్ ప్రభుత్వ చిత్తశుద్ధిని గమనించాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా నల్లగొండ జిల్లాలోనే 19 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చిందన్నారు. వానకాలం, యాసంగి సీజన్లో సుమారు 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని వివరించారు. దేశంలోనే ధాన్యం దిగుబడిలో అగ్రగామి గా ఉన్న పంజాబ్ రాష్ర్టాన్ని నేడు తెలంగాణ అధిగమించి ధాన్యం సేకరణలో రికార్డు సృష్టించిందని గుర్తు చేశారు. రైతుల సంక్షేమానికి ఎకరాకు రూ.10 వేలు పెట్టబడి సాయం అందించడంతో పాటు ఈ సీజన్లో రైతుల అవసరాల మేరకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచిన సీఎం కేసీఆర్ గొప్ప దార్శనికుడన్నారు.
అనంతరం రూ.50 లక్షలతో చేపట్టనున్న రామలింగేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను మంత్రి ప్రారంభించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్చైర్మన్ ఇరిగి పెద్దులు, అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ రాంచందర్నాయక్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎంసీ కోటిరెడ్డి, దేవాదాయ శాఖ ఏసీ మహేందర్ కుమార్, ఎంపీపీ బొల్లం జయమ్మ, జడ్పీటీసీ నందికొండ రామేశ్వరి, నిడమనూరు మార్కెట్ చైర్మన్ కామర్ల జానయ్య, డీసీసీబీ డైరెక్టర్ విరిగినేని అంజయ్య, ఎంపీడీఓ ప్రమోద్ కుమార్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ అంకతి వెంకటరమణ, వెనిగండ్ల పీఏసీఎస్ చైర్మన్ కేవీ రామారావు, దేవాదాయ శాఖ ఈఓ నవీన్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు పోలె డేవిడ్, సర్పంచులు అంకతి నర్మద, అల్లం శ్రీనివాస్, మేరెడ్డి పుష్పలత, ఎంపీటీసీ భాస్కరి నాగేంద్ర, విశ్వనాథుల రమేశ్, పెదమాం యాదయ్య, ముప్పారం వెంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర స్వామి ఆలయాల చైర్మన్లు మేరెడ్డి వెంకటరమణ, దరీబు లింగప్ప, మాజీ ఎంపీపీ చేకూరి హనుమంతరావు, నాయకులు పగిళ్ల సైదులు, కొండల్, సైదులు పాల్గొన్నారు.
రామచంద్రయ్య కుటుంబానికి మంత్రి పరామర్శ
దేవరకొండ : ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దేవరకొండకు చెంది ఏడ్పుల రామచంద్రయ్య కుటుంబ సభ్యులను విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి బుధవారం పరామర్శించారు. రామచంద్రయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, ఎంపీపీ నల్లగాసు జాన్యాదవ్, మున్సిపల్ చైర్మన్ ఆలంపల్లి నర్సింహ, జడ్పీటీసీలు పవిత్ర, బాలూనాయక్, టీఆర్ఎస్ నాయకులు హన్మంత్ వెంకటేశ్గౌడ్, బిక్కునాయక్, బొయపల్లి శ్రీనివాస్గౌడ్, శిరందాసు కృష్ణయ్య ఉన్నారు.