జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ఆధ్వర్యంలో నాటాలని నిర్దేశం
ప్రణాళిక సిద్ధం చేసుకున్న అధికారులు
కోదాడ రూరల్, మే 9 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన పాత్ర పోషిస్తున్నది. గతేడాది చేపట్టిన కార్యక్రమంలో అన్ని శాఖల కంటే ఎక్కువ మొక్కల పంపిణీతో పాటు వివిధ ప్రాంతాల్లో మొక్కలు నాటేలా చర్యలు చేపట్టింది. ఈ ఏడాది కూడా జూన్, జూలైలో చేపట్టే హరితహారంలో తమవంతు పాత్ర పోషించేందుకు సిద్ధం చేసుకున్నది.
ప్రతి నర్సరీలో వెయ్యి మొక్కలు
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న హరితహారంలో జిల్లా వ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేసింది. దీనికి అనుగుణంగా డీఆర్డీఓ పల్లె ప్రకృతి వనా లు, ప్రతి గ్రామంలో వన నర్సరీలు, ఇతర ప్రాంతాల్లో వివిధ శాఖల సహకారంతో నాటేందుకు మొక్కలు సిద్ధ్దం చేస్తుంది. పంచాయతీలో ఏర్పాటు చేసిన ప్రతి నర్సరీలో వెయ్యి మొక్కలు పెంచుతున్నారు.
ఏయే శాఖలు ఎన్నెన్నంటే..
జిల్లా అటవీ శాఖ 10 లక్షలు, డీఆర్డీఓ 40 లక్షలు, నీటి పారుదల 5 లక్షలు, మున్సిపాలిటీలు లక్ష, వ్యవసాయ శాఖ 7 లక్షలు, ఎక్సైజ్ 1.50 లక్షల మొక్కలను నాటాలని ప్రభుత్వం ఆదేశించింది. జిల్లా వ్యాప్తంగా జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ్ధ ద్వారా 475 గ్రామ పంచాయతీల్లో 475 నర్సరీల్లో 90 లక్షల మొక్కలు పెరుగుతుండగా, అటవీ శాఖ ద్వారా నిర్వహిస్తున్న నర్సరీల్లో 10 లక్షల మొక్కలు పెంచుతున్నారు.
నర్సరీల పర్యవేక్షణ
పంచాయతీల్లో నర్సరీలను ఎప్పడికప్పుడు జిల్లా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. మొక్కల పెంపకంపై ఎప్పటికప్పుడు వనసేవకులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. మొక్కల పెంపకంలో జాగ్రత్తలు పాటించాలని, నిర్లక్ష్యం చేయవద్దని ఆదేశించారు. మొక్కల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే వన సేవకులే బాధ్యత వహించాలని, ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులు అవుతారని హెచ్చరించారు. ప్రస్తుతం డివిజన్ స్థాయి లో అన్ని నర్సరీల మొక్కలను ఎప్పడికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
యాక్షన్ ప్లాన్ సిద్ధ్దంగా ఉంది
కోదాడ ప్రాంతాన్ని పచ్చగా రూపొందించేందుకు పక్కా యాక్షన్ ప్లాన్ సిద్ధ్దంగా ఉంది. ఈ ఏడాది హరితహారంలో నియోజకవర్గ అధికారులు, ప్రజాప్రతినిధులు, సమాజసేవకులు, యువత భాగస్వామ్యంతో పలు కొండ ప్రాంతాలను సీడ్బాల్స్తో పచ్చని అడవులను సృష్టించేందుకు సిద్ధ్దంగా ఉన్నాం. దీంతో పాటుగా పలు ఏనెలు, గుట్టలపై, సరిహద్దు పారిశ్రామిక వాడల్లో విరివిరిగా మొక్కలను నాటి ముఖద్వారమైన కోదాడను పచ్చగా మార్చి సీఎం కేసీఆర్ సార్కు బహుమతిగా అందిస్తాం. -బొల్లం మల్లయ్యయాదవ్, కోదాడ ఎమ్మెల్యే
నిత్యం పర్యవేక్షిస్తున్నాం
ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు దృష్టి సా రించాం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఎప్పటి కప్పుడు నర్సరీల్లో మొక్కలను పర్యవేక్షిస్తున్నాం. అన్ని శాఖల అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు. – పెంటయ్య, డీఆర్డీఏ, ఏపీడీ