సూర్యాపేట టౌన్, జూన్ 24 : ముఖ్యమంత్రి కేసీఆర్తోనే అందరి సమస్యలు పరిష్కారమవుతున్నాయని, మిగిలి ఉన్న సమస్యలను సైతం పరిష్కరించుకుంటామని వైద్య, ప్రజారోగ్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాండన్ సుదర్శన్ అన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఆ సంఘ కార్యాలయంలో జరిగిన సెకండ్ ఏఎన్ఎంల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సమైక్య పాలనలో 60 ఏండ్లకుపైగా అన్ని విధాలుగా తెలంగాణ ఆగమైందన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో స్వరాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్ ఏడేండ్లలోనే బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తున్నారని కొనియాడారు. గతంలో మాదిరిగా ధర్నాలు, రాస్తారోకోలు లేకుండానే కేవలం వినతుల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతున్నాయని పేర్కొన్నారు. సెకండ్ ఏఎన్ఎంల సమస్యలు కూడా సీఎం కేసీఆర్ దృష్టికి ఉత్తరం ద్వారా తెలియజేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు భూతరాజు సైదులు తదితరులు పాల్గొన్నారు.