భువనగిరి కలెక్టరేట్, నవంబర్ 22 :జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని, అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో యాదాద్రి భువనగిరిని అభివృద్ధిలో ముందు ఉంచుదామని జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి కోరారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. శాఖల వారీగా ఆయా అంశాలపై చర్చించి, సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పలు సూచనలు చేశారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్, కలెక్టర్ పమేలాసత్పతి పాల్గొన్నారు.
జిల్లా సమగ్రాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు. ప్రజాప్రతినిధులకు అధికారులు పూర్తిస్థాయిలో సహకరించాలన్నారు. ఎలాంటి సమస్య తలెత్తినా సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని ఆదేశించారు. అనంతరం అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివిధ శాఖల ఆధ్వర్యంలో రూపొందించిన నివేదికలను చదివి వినిపించారు. సమావేశంలో కలెక్టర్ పమేలాసత్పతి, జడ్పీ వైస్ చైర్మన్ ధనావత్ బీకూనాయక్, జడ్పీటీసీలు సుబ్బూరు బీరుమల్లయ్య, కుడుదుల నగేశ్, గోళి ప్రణీత, కొడిత్యాల నరేందర్రెడ్డి, కోట పుష్పలత, చిలుకూరి ప్రభాకర్రెడ్డి, పల్లా వెంకట్రెడ్డి, గోరుపల్లి శారద, వీరమల్ల భాను, చామకూర గోపాల్, పున్న లక్ష్మి, వాకిటి పద్మ, తోటకూరు అనూరాధ, కోఆప్షన్ సభ్యుడు ఎండీ.ఖలీల్, జడ్పీ సీఈఓ సీహెచ్.కృష్ణారెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసరావు, జిల్లా స్థాయి అధికారులు, ఎంపీపీలు పాల్గొన్నారు.
ప్రజలందరికీ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలందరికీ అందుతున్నాయి. భువనగిరిలోని చెరువుల కింద ఉన్న ఆయకట్టు భూములకు నీటిని విడుదల చేయాలి. భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండడంతో చెరువులు జలకళ సంతరించుకున్నాచి. ఫుల్ ట్యాంక్ లెవల్ భూముల్లో పంట సాగుకు తూముల ద్వారా నీటిని విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.
– ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి
అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలి
జిల్లాలోని అధికారులు తమ పనితీరును పూర్తి స్థాయిలో మెరుగుపర్చుకోవాలి. జడీ సర్వసభ్య సమావేశాలకు వచ్చేటప్పుడు అభివృద్ధి, ప్రగతి పనులపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడం సరైందికాదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు అధికారులు పాటుపడాలి. వివరాలు సమగ్రంగా తెలుకుని పథకాల అమలు తీరుతెన్నులను ప్రజలకు వివరించాలి.
– తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్