సూర్యాపేట, జూన్ 28 : సూర్యాపేట పట్టణ సుందరీకరణపై ప్రజా ప్రతినిధులు, మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఇకపై వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు ఉంటాయని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించి కలెక్టరేట్లో కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణతో కలిసి మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎలాంటి రాజీ లేకుండా పారదర్శకంగా అభివృద్ధి పనులు జరగాలని తెలిపారు. స్థానిక జమ్మిగడ్డ జాతీయ రహదారి నుంచి ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వరకు మీడియన్ సుందరీకరణ పనులు, సద్దల చెరువు కట్టపై జరుగుతున్న సుందరీకరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సద్దుల చెరువు కట్ట వద్ద చేపట్టిన మహాప్రస్థానాన్ని అద్భుతంగా రూపుదిద్దనున్నట్లు చెప్పారు. పారిశుధ్య పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలని, డోర్ టూ డోర్ చేత్త సేకరణ చేయాలన్నారు. ప్రజలకు చెత్త సేకరణపై అవగాహన కల్పించాలని సూచించారు.
అలాగే శుభ్రమైన పట్టణాల్లో దేశంలో మొదటిస్థానంలో ఉన్న ఇండోర్ మున్సిపల్ అభివృద్ధిని పరిశీలించేందుకు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారుల పరిశీలనకు టూర్ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్ను మంత్రి ఆదేశించారు. వర్షాల వల్ల తాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని, నిరంతరం ఫాగింగ్ చేపట్టాలని తెలిపారు. 8వ విడుత హరితహారంలో భాగంగా సూర్యాపేట మున్సిపాలిటీలో 7.20 లక్షల మొక్కలు నాటే లక్ష్యం నిర్దేశించినట్లు ఈ మేరకు వార్డుల్లోని ఖాళీ స్థలాల్లో, ప్రభుత్వ భవనాల ప్రాంగణాల్లో విరివిగా మొక్కలు నాటాలన్నారు. సూర్యాపేట పట్టణాన్ని పచ్చని తివాచీలా చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎస్.మోహన్రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్ట కిశోర్, కమిషనర్ బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, ఈఈ ప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు గుర్రం సత్యనారాయణరెడ్డి, రాం గిరి నగేశ్, కౌన్సిలర్ యాదగిరి పాల్గొన్నారు.
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ
చివ్వెంల : పేదింటి ఆడబిడ్డల కుటుంబాలకు కల్యాణలక్ష్మి పథకం అండ అని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని వల్లభాపురం, మూన్యానాయక్తండా, బీబీగూడెం, పాచ్యానాయక్తండా, గాయంవారి గూడెంలో 62 మంది లబ్ధిదారులకు రూ.62 లక్షల 7 వేల 192 విలువ గల చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడబిడ్డ పైండ్లెన నాటి నుంచి పిల్లలకు జన్మనిచ్చే వరకు తల్లి, పిల్లలకు ప్రభుత్వం అండగా నిలుస్తూ ప్రసూతి ఖర్చులు అందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ధరావత్ కుమారీబాబూనాయక్, జడ్పీటీసీ భూక్యా సంజీవ్ నాయక్, వైస్ ఎంపీపీ జూలకంటి జీవన్రెడ్డి, ఆర్డీఓ రాజేంద్రకుమార్, తాసీల్దార్ రంగారావు, ఎంపీడీఓ లక్ష్మి, ఎంపీఓ గోపి, సర్పంచులు జీడిమెట్ల నాగలక్ష్మీలక్ష్మయ్య, పల్లేటి శైలజానాగయ్య, పుట్ట గురువేందర్, ఉప సర్పంచ్ బైరు రవీందర్, టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శి పర్వతం తిరుపతయ్య, జిల్లా నాయకులు రామగిరి నగేశ్, యలగబోయిన శ్రీరాములు, లక్ష్మయ్య, సైదులు, జానీపాష, కృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.
విలాసకవి నిర్మలకు మంత్రి అభినందన
సూర్యాపేటటౌన్ : అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియామకమైన విలాసకవి నిర్మల స్థానిక క్యాంపు కార్యాలయంలో మంత్రి జగదీశ్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఆమెను అభినందించారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు తాటిపాముల నాగలక్ష్మి, వర్కింగ్ ప్రెసిడెంట్ తంతెనపల్లి సుజాత, ఉపాధ్యక్షురాలు కమల, రమణ, శాంతారాజ్యం, తయోబ్ పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ కొత్త కార్యవర్గం
బొడ్రాయిబజార్ : ప్రభుత్వం చేయలేని సేవా కార్యక్రమాలను ఒకానొక సమయంలో స్వచ్ఛంద సంస్థలు చేస్తూ ప్రజలకు దగ్గరవుతాయని అలాంటి స్వచ్ఛంద సంస్థే లయన్స్ క్లబ్ అని మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. సోమవారం రాత్రి స్థానిక ఐఎంఏ ఫంక్షన్హాల్లో ఏర్పాటు చేసిన లయన్స్ క్లబ్, అనుబంద క్లబ్ల నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గుండె జబ్బుల నివారణకు ప్రత్యేక ఇంజక్షన్ను అందుబాటులో ఉంచినట్లు, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం లయన్స్ క్లబ్ ఇంజక్షన్ ఆఫీసర్ రామానుజాచార్యులు నూతన కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. లయన్స్ క్లబ్ సూర్యాపేట అధ్యక్షుడిగా డాక్టర్ రమేశ్చంద్ర, సెక్రటరీగా యాదా కిరణ్, కోశాధికారిగా రాచకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పాశం అనంతరాములు, గవ్వ కృష్ణారెడ్డి, ముద్ద భిక్షపతి, కుమ్మరికుంట్ల లింగయ్య, వాంకుడోతు వెంకన్నతో పాటు ఇతర సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, అమృతపల్లి కోటేశ్వర్రావు, గండూరి కృపాకర్ పాల్గొన్నారు.