సూర్యాపేట : బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్రావుకు వీరాభిమాని సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి చెందిన సురేశ్పై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఎమ్మెల్యే , మాజీ మంత్రి జగదీష్రెడ్డి (MLA Jagdish Reddy) తీవ్రంగా ఖండించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న సురేష్ను మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, బీఆర్ఎస్ నాయకులతో కలసి గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా దాడి వివరాలను బాధితుడి నుంచి అడిగి తెలుసుకున్నారు.
అనంతరం జగదీష్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ (BRS)పాలన, రైతాంగానికి అందించిన సంక్షేమ కార్యక్రమాకు ఆకర్షితుడై పార్టీకి, కేసీఆర్ (KCR) కు ఆదర్శ రైతు సురేష్ అభిమానిగా మారాడని తెలిపారు. అటువంటి వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసి గాయపరచడం దుర్మర్గమైన చర్య అని అన్నారు. ‘ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసే నాటి నుంచి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తలు దాడులకు (Attack) పాల్పడుతున్నారు. జిల్లా మంత్రులకు, పోలీసులకు విజ్ఞప్తి చేస్తున్నా. ఘర్షణలకు పాల్పడడం సరియైనది కాదు. గతంలో ఘర్షణల వల్లే తెలంగాణ నాశనమైంది. రాజకీయ తగదాలతో దశాబ్దాల పాటు గ్రామాలు వల్లకాడులు అయ్యాయని’ ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే గ్రామాల్లో శాంతివాతావరణం తీసుకువచ్చామని, ఎక్కడా కూడా ఘర్షణ పరిస్థితిలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు.దురదృష్టవశాత్తు గడిచిన 15 రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయని, పోలీసులు దృష్టిని సారించి నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నేరాలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, జిల్లా పోలీసులు దాడులను అదుపులో పెట్టవలసిన బాధ్యత ఉందని సూచించారు. ‘ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నమో తెలిసిన వాళ్లం. చిల్లర విషయాలకు ఆవేశానికి లోనుకావద్దని బీఆర్ఎస్ శ్రేణులను కోరారు. ప్రజాపాలన లో అర్హులైన వారందరూ హాజరయ్యేలా చూడాలని కార్యకర్తలకు సూచించారు.