సూర్యాపేట : గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు కలిసి కట్టుగా పని చేద్దామని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. జిల్లాలోని తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక శుభమస్తు ఫంక్షన్ హాల్లో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై జిల్లా ఎస్పీ అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ అవగాహన సదస్సుకు తిరుమలగిరి, నాగారం, అర్వపల్లి మండలాల పరిధిలో గల గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ, ప్రవేటు విద్యాసంస్థలు ప్రిన్సిపాల్, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు, రెవెన్యూ సిబ్బంది, ఎడ్యుకేషన్ సిబ్బంది, ఎక్సైజ్ సిబ్బంది హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలు మనకు ఇచ్చిన అధికారాలను, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి గంజాయి రహిత సమాజ నిర్మాణానికి, బంగారు తెలంగాణ నిర్మాణానికి కట్టుబడి పని చేద్దామన్నారు.
గంజాయి రహిత జిల్లా కోసం జిల్లాలో ఒక సామాజిక విప్లవాన్ని తెచ్చి గంజాయి రహిత జిల్లాగా మార్చి రాష్ట్రానికి రోల్ మోడల్ గా నిలవాలని ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, పౌరులు కలిసికట్టుగా పనిచేసి గంజాయి నిర్మూలిస్తాం అని ప్రతిజ్ఞ చేశారు.