యాదాద్రి భువనగిరి, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో 2014 కంటే ముందు వంతెనల జాడ లేదు. వాగులు, వంకలు వచ్చే చోట పరిస్థితి దారుణంగా ఉండేది. అనేక చోట్ల బ్రిడ్జీలు నిర్మించకుండా.. రోడ్డు కింద గూనలు, పెద్ద పైపులు వేసి వాటిపై మట్ట్టిపోసి మమ అనిపించడంతో చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్డు ఆగమయ్యేది. రోడ్డుపై నుంచి వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉండేది. మరికొన్ని చోట్ల కింద గూనలు వేసి పైన రోడ్డు వేయగా.. భారీ వర్షాలకు వాగులు పొంగి ఆ నీరు రోడ్డుపై నుంచి వెళ్లడంతో రాకపోకలు నిలిచిపోయేవి. అనేక గ్రామాలకు బస్సులు కూడా తాత్కాలికంగా బంద్ చేసిన ఘటనలూ ఉన్నాయి.
10 వంతెనల నిర్మాణం..
సొంత రాష్ట్రంలో ప్రజలకు మంచిరోజులొచ్చాయి. ప్రజల ఇబ్బందులు గుర్తించిన తెలంగాణ ప్రభుత్వం వంతెనల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఎక్కడెక్కడ ఎన్ని వంతెనలు అవసరం..? ఎంత బడ్జెట్ కావాలి..? ఎంత మంది జనాలకు లాభం..? ఎన్ని గ్రామాలకు ఇబ్బందులు తీరనున్నాయి..? అనే అంశాలను పరిశీలించి దశల వారీగా జిల్లా వ్యాప్తంగా వంతెనల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. చిన్న గ్రామాల్లో కూడా వంతెనలు ఏర్పాటు చేశారు. తెలంగాణ వచ్చాక జిల్లా వ్యాప్తంగా 10 పెద్ద వంతెనలు నిర్మించారు. ఇందుకోసం రూ.49 కోట్ల నిధులు ఖర్చు చేశారు.
తాజాగా మరో మూడు వంతెనలు
రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో అవసరమైన వంతెనలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందుకోసం ఇటీవల జిల్లాలో మూడు బ్రిడ్జీల నిర్మాణానికి అనుతులు ఇచ్చింది. ఇందుకోసం రూ. 32.8 కోట్లు మంజూరు చేసింది. త్వరలో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. రూ. 9.50 కోట్లతో రాజాపేట మండలంలోని రేణికుంట – బేగంపేట మధ్య, రూ. 12.5 కోట్లతో పారుపల్లి వద్ద బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. పోచంపల్లి మండలంలోని రుద్రవెల్లి వద్ద రూ. 10.80 కోట్లతో వంతెన నిర్మించనున్నారు. ఇది పూర్తయితే బీబీనగర్, భూదాన్పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల పరిసర గ్రామాలకు వెళ్లేందుకు మార్గం సులభమవుతుంది.
సాఫీగా ప్రయాణం
జిల్లా వ్యాప్తంగా ఎక్కడిక్కడ వంతెనలు నిర్మించడంతో ప్రజల ఇబ్బందులు తీరాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు వచ్చినా, వాగులు, వంకలు పొంగినా సమస్యలు తలెత్తడం లేదు. ఉద్యోగులు, వ్యాపారులు తమ కార్యకలాపాలు యథావిధిగా చేసుకుంటున్నారు. ఆలేరు, భువనగిరి, బీబీనగర్, వలిగొండ, పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల నుంచి హైదరాబాద్కు నిత్యం వందల సంఖ్యలో ఉద్యోగులు విధులకు వెళ్తుంటారు. వంతెనలు అందుబాటులోకి రావడంతో ప్రయాణం సాఫీగా సాగిస్తున్నారు.
నిధులు మంజూరు హర్షణీయం
భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు – రుద్రవెల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి నిర్మాణ కోసం ప్రభుత్వం రూ. 10.5 కోట్లు మంజూరు చేయడం హర్షణీయం. వారం రోజుల్లో టెండర్ పనులు పూర్తి చేసి పనులు ప్రారంభించనున్నారు. ఐదు సంవత్సరాల క్రితం రూ. 8.5 కోట్లతో బ్రిడ్జి పనులు చేపట్టారు. కాంట్రాక్టర్ బ్రిడ్జి స్థలం కోసం రైతులకు డబ్బులు చెల్లించకపోవడంతో వివాదం నెలకొని పనులు నిలిచిపోయాయి. ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే బీబీనగర్, భూదాన్ పోచంపల్లి, చౌటుప్పల్ మండలాల గ్రామాలకు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది. ఎన్నో ఏళ్లుగా బ్రిడ్జి కోసం ఎదురు చూస్తున్న ప్రజల కోరిక నెరవేరనున్నది.
– పాటి సుధాకర్రెడ్డి, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు, భూదాన్ పోచంపల్లి
ఇబ్బందులు తొలగనున్నాయి.
కొన్నేండ్లక్రితం కుర్రారం చెరువుకు గండి పడి వరద ఎక్కువై పారుపల్లి వాగుపై ఉన్న బ్రిడ్జి కొట్టుకపోయింది. తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. అయితే శాశ్వత బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి కృషి చేసి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించారు. త్వరలోనే బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్తవుతాయి. ఈ బ్రిడ్జి పూర్తయితే ప్రయాణికుల ఇబ్బందులు తీరుతాయి.
–రాపోలు కవితాతిరుపతిరెడ్డి, పారుపల్లి ఎంపీటీసీ, రాజాపేట