Congress Attack | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గూండా రాజ్యం మొదలైందని బీఆర్ఎస్ ఆరోపించింది. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం కాసర్ల పహాడ్ గ్రామ బీఆర్ఎస్ నాయకుడు, యువ రైతు మెండే సురేష్ మీద కాంగ్రెస్ పార్టీ గూండాలు మూకుమ్మడి దాడి చేశారు.
మెండే సురేష్ తన వ్యవసాయ క్షేత్రంలోని ఇంటి వద్ద ఉన్నప్పుడు అక్కడికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు దుర్భాషలాడారు. అతనిపై బీరు బాటిళ్లు, కర్రలతో మూకుమ్మడి దాడి చేశారు. మెండే సురేష్తోపాటు మహిళలని కూడా చూడకుండా ఆయన కుటుంబ సభ్యులపైనా కర్రలతో దాడి చేశారు. తీవ్రమైన గాయాలతో బాధ పడుతున్న సురేష్ని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, పోలీసులు అంబులెన్స్లో సూర్యాపేట లోని దవాఖానకు తరలించారు.
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డి గూడెం మండలం కాసర్ల పహాడ్ గ్రామ బీఆర్ఎస్ యువ నేత మెండే సురేష్పై కాంగ్రెస్ గూండాల దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. రైతు బంధు ఆలస్యమవుతున్నదని ప్రశ్నించినందుకు సురేష్ మీద దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని డిమాండ్ చేశారు. త్వరలో తుంగతుర్తి వెళ్లి మెండే సురేష్ను పరామర్శిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.