జనగామ చౌరస్తా, జూన్ 15 : తెలంగాణకు హరితహారంలో భాగంగా నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని జిల్లా కలెక్టర్ కే నిఖిల అన్నారు. మంగళవారం కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ వరంగల్ సర్కిల్ ఎస్ జే ఆశతో కలిసి జిల్లాలోని వరంగల్-హైదరాబాద్ నేషనల్ హైవే వెంట చేపట్టిన అవెన్యూ ప్లాంటేషన్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా నిఖిల మాట్లాడుతూ నేషనల్ హైవే వెంట జనగామ జిల్లాలో 19 వేల మొక్కలను నాటినట్లు వివరించారు. ఎండిపోయిన మొక్కల స్థానంలో వెంటనే కొత్త మొక్కలను నాటాలని ఆమె అధికారులను కోరారు. ఆక్రమణలతో మొక్కలకు నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలన్నారు. సమస్యలున్న చోట ఎంపీడీవో, తహసీల్దార్లు వెంటనే పరిష్కరించాలన్నారు. అనంతరం వారు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో చేపడుతున్న ప్లాంటేషన్ను పరిశీలించారు. ఒప్పంద సమయంలో ఏ రకం మొక్కలు, ఏ తరహాలో నాటాలో సమగ్రంగా వివరించాలని నిఖిల సూచించారు. నిబంధనల మేరకు పనులు పూర్తి చేయాలని, అతిక్రమిస్తే ఉపేక్షించబోమని తెలిపారు. ప్లాంటేషన్ వేగం పెంచి, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, డీఎఫ్వో అర్పణ, డీఆర్డీవో జీ రాంరెడ్డి, ఎఫ్ఆర్వోలు శంకర్, కొండల్రెడ్డి పాల్గొన్నారు.