ముంబై: ఐపీఎల్ 2021 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ మరోసారి అద్భుత ప్రదర్శన చేసింది. ఆదివారం పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఓపెనర్ శిఖర్ ధావన్(92: 49 బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) శతక సమాన ఇన్నింగ్స్తో చెలరేగడంతో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆరంభంలో పృథ్వీ షా(32: 17 బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు), చివర్లో స్టాయినీస్(27 నాటౌట్: 13 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్), లలిత్ యాదవ్(12 నాటౌట్: 6 బంతుల్లో 2ఫోర్లు) వీరవిహారం చేయడంతో 4 వికెట్లు కోల్పోయి 18.2 ఓవర్లలోనే అలవోకగా లక్ష్యాన్ని చేధించింది.
భారీ లక్ష్యాన్ని సైతం కాపాడుకోవడంలో పంజాబ్ బౌలర్లు విఫలమవడంతో మరో ఓటమి తప్పలేదు. కీలకమైన 17వ ఓవర్లో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రెండు నోబాల్స్ వేసి, 20 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోకి వెళ్లిపోయింది. పంజాబ్ బౌలర్లలో జే రిచర్డ్సన్ రెండు వికెట్లు తీయగా రిలే మెరిడిత్, అర్షదీప్ సింగ్ చెరో వికెట్ తీశారు.
అంతకుముందు ఓపెనర్లు కేఎల్ రాహుల్(61: 51 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు), మయాంక్ అగర్వాల్(69: 36 బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లు) హాఫ్సెంచరీలతో విజృంభించడంతో పంజాబ్ 20 ఓవర్లలో 4 వికెట్లకు 195 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లను ధాటిగా ఎదుర్కొంటూ ఇన్నింగ్స్ ఆద్యంతం వీరిద్దరూ అద్భుత బ్యాటింగ్తో అలరించారు. చివర్లో దీపక్ హుడా(22 నాటౌట్), షారుక్ ఖాన్(15 నాటౌట్) మెరిశారు. ఢిల్లీ బౌలర్లలో క్రిస్ వోక్స్, మెరీవాలా, రబాడ, ఆవేశ్ ఖాన్ తలో వికెట్ తీశారు.