సూర్యాపేట : హైదరాబాద్లోని సుల్తాన్బజార్ పోలీస్స్టేషన్లో అడిషనల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న సీఐ సుందరి లక్ష్మణ్(39), భార్య ఝాన్సీ(35) దంపతులు ఈ నెల 8వ తేదీ అర్థరాత్రి రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయిన విషయం తెలిసిందే. అత్తగారి గ్రామం గరిడేపల్లి మండలం కొండాయిగూడెంలో జరిగిన రామాలయ పునఃప్రారంభం, ధ్వజ స్తంభారోహణ కార్యక్రమాలకు సతీమణి ఝాన్సీతో కలిసి సీఐ హాజరయ్యారు. అనంతరం పెన్పహాడ్ మండలంలోని స్వగ్రామం నాగులపాటి అన్నారానికి చేరుకున్నారు.
తమ కూతురిని అక్కడే తల్లి వద్ద ఉంచి కొడుకుని తీసుకుని విధుల్లో చేరేందుకు భార్యతో కలిసి కారులో హైదరాబాద్ బయల్దేరారు. హైదరాబాద్ సమీపంలోని అబ్దుల్లాపూర్మెట్ దగ్గరకు వచ్చేసరికి రోడ్డు ప్రక్కగా ఉన్న లారీని కారు వెనకనుంచి ఢీకొనడంతో అక్కడికక్కడే సీఐ దంపతులు మృతిచెందారు. అదృష్టవశాత్తు వీరి కొడుకు ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డాడు.
ఇరువురిని కోల్పోయిన ఆ కుటుంబం కొండంత విషాదాన్ని లక్ష్మణ్ సహచరులు 2009 ఎస్ఐ బ్యాచ్మేట్స్ పంచుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరైన ఆ చిన్నారులకు తమ వంతుగా ఆర్థిక చేయూత అందించి అండగా నిలిచారు. ఆంధ్ర, తెలంగాణలో పనిచేస్తున్న బ్యాచ్మేట్స్ అందరూ 1100 మంది కలిసి రూ. 35 లక్షలు జమచేసి అందజేశారు. పెన్పహాడ్ మండలం అన్నారం గ్రామంలో గురువారం జరిగిన 11వ రోజు కర్మలో వీరంతా నివాళులర్పించి ఆర్థికసాయాన్ని అందజేశారు. తామున్నామని సీఐ దంపతుల కూతురు ఆకాంక్ష, కుమారుడు సహాస కు భరోసా ఇచ్చారు.